
పోలవరం ప్రాజెక్టు వాస్తవాలు పుస్తకం ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు
రాజధాని ప్రాంతం నిర్ణయమైన తర్వాత దాని గురించి కొందరు అపరిపక్వంగా మాట్లాడుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
రాజధాని ప్రాంతంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
కేపిటల్ అనకపోతే తుళ్లూరు భూములకు అంత రేటు వచ్చేదా
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతం నిర్ణయమైన తర్వాత దాని గురించి కొందరు అపరిపక్వంగా మాట్లాడుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తుళ్లూరు కాదనుకుంటే దొనకొండకు రావాలని, అక్కడ 40 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని బలరామ్మూర్తి (టీడీపీ) వంటి నేతలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ మాత్రమే కాదని దానికి హంగులు, ఆకర్షణలు, వసతులు అనేకం ఉండాలని తెలిపారు. శనివారం విజయవాడలో ‘పోలవరం ప్రాజెక్టు-వాస్తవాలు’ పేరుతో బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు రాజధానిపై మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ నగరాలను కలిపేలా రాజధాని ఉండాలని తాను చంద్రబాబుకు సూచించానన్నారు. రాజధాని అని చెప్పకపోతే తుళ్లూరు భూములకు అంత రేట్లు వచ్చేవా అని ప్ర శ్నించారు.
పోలవరం వల్ల తెలంగాణకు నష్టం లేదు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క శాతం కూడా నష్టం జరగదని, అలా జరిగితే దానికి తాను ఒప్పుకోనని, బీజేపీ అస్సలు ఒప్పుకోదని వెంకయ్యచెప్పారు. 1942 నుంచి అనేక మంది నాయకుల కృషి వల్ల ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోందన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏడాది లోపే గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
గొడవ చేస్తే రాజధాని నూజివీడుకే..
భూముల గురించి గొడవ చేస్తే నూజివీడుకు రాజధాని తరలిపోతుందని, అక్కడ చాలా ప్రభుత్వ భూములున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. తనకు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వచ్చిన రాజధాని రైతు సంఘాల సమాఖ్య నాయకుడు మల్లెల శేషగిరిరావు, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి నేతలు కొలనుకొండ శివాజీ, అనుమోలు గాంధీ తదితరులతో వెంకయ్య ఈ మాట చెప్పారు. వినతిపత్రంపై వెంకయ్య అసహనం వ్యక్తం చేస్తూ, తుళ్లూరు కాకపోతే ప్రభుత్వ భూములున్నచోటకు వెళతామన్నారు. దీంతో అవాక్కయిన రైతు నాయకులు తాము తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కానీ అక్కడి రైతులకు న్యాయం చేయాలని కోరారు.