రేపటి వరకు ఓటర్ల తుది జాబితా | Until the final voters' list for tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి వరకు ఓటర్ల తుది జాబితా

Jan 30 2014 2:44 AM | Updated on Sep 2 2017 3:09 AM

శుక్రవారం నాటికి జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శుక్రవారం నాటికి జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18-19 సంవత్సరాలు గల యువత 67,716 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. 14,988 మంది బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.

జిల్లాలో  ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 83పోలింగ్ కేంద్రాలకు ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం లేదని, ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయిలో తొమ్మిది, ఏటూరునాగారంలో 18, గోవిందరావుపేటలో 14 గ్రామాలు, మహబూబాబాద్ నియోజకవర్గంలో 22గ్రామాలకు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేనట్లు తెలిపారు. పోలీసు బందోబస్తుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు.

మేడారం జాతర దృష్ట్యా ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు  ఎంపీడీవోల బదిలీలను జాతర అనంతరం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరగా.. ఎన్నికల కమిషనర్ అనుమతించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement