ట్రస్టు భూములపై వివాదం | Trust land dispute | Sakshi
Sakshi News home page

ట్రస్టు భూములపై వివాదం

Jul 10 2014 2:02 AM | Updated on Sep 17 2018 6:18 PM

కనకవల్లిలోని ధర్మవరం తోట అనే బ్రాహ్మణుల అగ్రహారం ట్రస్టు వివాదం చిలికిచిలికి గాలివానాలా మారింది. దీంతో కనకవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  •       నివేశన స్థలాలివ్వాలని లబ్ధిదారులు
  •       వరినాట్లు వేసిన ఆక్రమణదారులు
  •       నివురుగప్పిన నిప్పులా విభేదాలు
  •       కనకవల్లిలో ఉద్రిక్తత
  •       పోలీస్ పికెట్ ఏర్పాటు
  • తోట్లవల్లూరు : కనకవల్లిలోని ధర్మవరం తోట అనే  బ్రాహ్మణుల అగ్రహారం ట్రస్టు వివాదం చిలికిచిలికి గాలివానాలా మారింది. దీంతో కనకవల్లిలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై ఆక్రమణదారులకు, నివేశనస్థలాలు కోరుతున్న లబ్ధిదారులకు  మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది.  సర్పంచి ఫిర్యాదుతో గ్రామంలో బుధవారం  పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

    గ్రామస్తుల కథనం ప్రకారం... కనకవల్లిలో ధర్మవరం తోట అనే  బ్రాహ్మణుల అగ్రహారం ఉంది. సర్వే నంబరు 76-1లో 1.60సెంట్లు, 76-3లో 4.80సెంట్లు, 78లో 3. 71సెంట్లు  కలిపి   సుమారు 10 ఎకరాల భూమి ఉంది. దీనికి  ట్రస్టీగా పెనమకూరు వంశీయులు ఉండేవారు. 1984లో అప్పటి  అగ్రహారం దారు, సర్పంచి శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజులు ఆ భూమిని నిరుపేదల నివేశన స్థలాల కోసం కేటాయించారు. అర్హులైన నిరుపేదలకు ఒక్కొక్కరికీ 5 సెంట్లు చొప్పున స్థలాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. తొలుత అస్తవ్యస్తంగా ఉన్న ఆ ప్రాంతం కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

    ఎవరికీ వ్యక్తిగత హక్కులు లేనప్పటికీ  పక్కా గృహాలు నిర్మించుకోవడంతో గ్రామపంచాయతీ కూడా  రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి అభివృద్ధిచేసింది. అయితే  నివేశనా స్థలాలకు కేటాయించిన భూమిలో  అప్పట్లో పూర్తిస్థాయి ఇళ్లు వేయకపోవడంతో, సుమారు ఎకరంన్నర  వరకు అన్యాక్రాంతమైందని గ్రామస్తులంటున్నారు.  గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని  చెబుతున్నారు.
     
    స్థలాల కోసం ఎదురుచూపు...

    గ్రామంలో  కుటుంబాల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుండటంతో  నివేశనస్థలాలు కావాల్సిన వారి సంఖ్య  పెరిగింది. సుమారు 40 నుంచి50 మంది లబ్ధిదారులు  ఆక్రమణల చెరలో ఉన్న భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని కోరుతున్నారు. దీనిపై  కొంత కాలంగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత సోమవారం ప్రజావాణిలో సర్పంచి మరీదు సీతమ్మ ఆధ్వర్యంలో  లబ్ధిదారులు  కలెక్టర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు.
     
    గ్రామంలో ఉద్రిక్తత...

    సంబంధిత భూమిని  ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులు, ఆ భూమిని వారికి దక్కనీయకూడదని ఆక్రమణదారులు ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు.  ఆక్రమణదారులు సంబంధిత భూముల్లో వరినాట్ల కార్యక్రమం బుధవారం చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమపై దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారని లబ్ధిదారులు, తమపైనే దాడి చేశారని ఆక్రమణదారులు  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

    లబ్ధిదారులకు అండగా ఉన్న తనను ఆక్రమణదారులు బెదిరిస్తున్నారంటూ సర్పంచి సీతమ్మ పోలీసులను ఆశ్రయించింది.  సమాచారం అందుకున్న ఎస్‌ఐ డి.సురేష్ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏఎస్‌ఐ శ్రీరంగనాధ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆక్రమణదారుల మాత్రం యథావిధిగా వరినాట్ల కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement