కర్నూలు జిల్లా విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై రైతులు మృతి చెందిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ శుక్రవారం విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు పంటను ధ్వంసం చేయకుండా పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుకూర్ బాషా, ఉప్పరి సుధాకర్, ప్రవల్లిక మృతిచెందగా.. మద్దమ్మ(85), మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కోవెలకుంట ఆస్పత్రికి తరలించారు.