
అట్లూరు(బద్వేలు): అగ్రిగోల్డ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకటరామారావుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ వైఎస్సార్ జిల్లా బద్వేలు కోర్టు తీర్పు వెలువరించింది. జిల్లాలోని పోరుమా మిళ్ల, సిద్ధవరం భూముల వ్యవహారంలో మోసానికి పాల్పడ్డారన్న కేసులో ఈ శిక్ష విధిం చింది. అంతేగాక రూ.6వేల జరిమానా విధించింది. ఈ మేరకు బద్వేలు జూనియర్ సివిల్ జడ్జి ఆర్.ఎం.శుభవల్లి మంగళవారం తీర్పు చెప్పారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పోరుమామిళ్ల మండలం లోని పోరుమామిళ్ల, సిద్ధవరం గ్రామాలకు చెందిన 300 ఎకరాల భూమిని పండ్లతోటల సాగు నిమిత్తం మ్యాక్స్వర్త్ ఆర్చెడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తమ ఏజంట్లు వెంకటేశ్వరప్రసాద్, రవిబాబులద్వారా పవర్ ఆఫ్ పట్టా పొంది రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
అయితే 2001లో ఆ కంపెనీకి తెలియకుండా.. ఏజెంట్లుగా ఉన్న వెంకటేశ్వర ప్రసాద్, రవిబాబుల తో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు కుమ్మక్కై అడ్డగోలుగా అగ్రిగోల్డ్ కంపెనీకి 300 ఎకరాల్ని కేవలం రూ.15 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ముగ్గురిపై మ్యాక్స్వర్త్ ఆర్చెడ్స్ కంపెనీ 2001లో పోరుమామిళ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 409, 419, 420, 421, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఏలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అవ్వా వెంకటరామారావును పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం బద్వేలు కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు జడ్జి మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ చైర్మన్ను కడప సెంట్రల్జైలుకు తరలించారు. మాక్స్వర్త్ ఏజెంట్లుగా ఉంటూ అగ్రిగోల్డ్ కంపెనీకి భూమిని అమ్మినవారిలో వెంకటేశ్వర ప్రసాద్ మృతిచెందగా, రవిబాబు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.