భర్త కిరాతకం | The brutal husband | Sakshi
Sakshi News home page

భర్త కిరాతకం

Jul 19 2015 12:08 AM | Updated on Sep 3 2017 5:45 AM

భర్త కిరాతకం

భర్త కిరాతకం

జీవితాంతం తోడూనీడగా ఉంటానని అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. భార్యతోపాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డను సైతం మట్టు పెట్టాలని చూశాడు.

♦ భార్య, బిడ్డ, వృద్ధురాలిపై పెట్రోలు పోసి హత్యాయత్నం
♦ చికిత్సపొందుతూ భార్య, బిడ్డ మృతి
♦ చికిత్స పొందుతున్న వృద్ధురాలు
 
 విజయవాడ : జీవితాంతం తోడూనీడగా ఉంటానని అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. భార్యతోపాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డను సైతం మట్టు పెట్టాలని చూశాడు. పర స్త్రీ వ్యామోహంలో ఓ మృగాడు భార్య, నెలలు కూడా నిండని బిడ్డతో పాటు భార్య అమ్మమ్మను కూడా మట్టుపెట్టేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.  తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య, బిడ్డ మృతిచెందారు. వృద్ధురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన చిట్టినగర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ ఈద్గామహల్ కొండ ప్రాంతంలో కొరికాని వెంకటమ్మ (60) మనవరాలైన రోజాను సుమారు 18 నెలల కిందట మంగళగిరి సమీపంలోని ఎర్రుబాలెంకు చెందిన ఆకుల రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు.

వివాహ సమయంలో రూ. 2 లక్షల కట్నం, లాంఛనాలతో పాటు కొండపై ఇంటిని ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.  మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే రాజేంద్రకు పెళ్లికి ముందు నుంచే వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు రోజాకు తెలిసింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.  వివాహం జరిగిన కొన్ని నెలలకే రోజాకు వేధింపులు ఎక్కువ కావడంతో పాటు విడాకులు ఇవ్వాలని అత్తింటి వారు పట్టుబట్టారు.  గర్భవతి అయిన రోజా ఇక అత్త గారి ఇంట్లో ఉండలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చేసింది. మగ బిడ్డ పుట్టిన తర్వాత కూడా భర్తలో మార్పు రాకపోవడంతో అమ్మమ్మ వద్దే ఉంటోంది. 

కాపురానికి రావాలని రాజేంద్ర భార్యను అడిగే వాడు. ప్రవర్తన మార్పువస్తే గాని కాపురానికి రానని ఆమె తేల్చి చెప్పింది. ఈ క్రమంలో శనివారం ఉదయం  భార్య వద్దకు వచ్చిన రాజేంద్ర ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం తన బైక్ వద్దకు వెళ్లి బైక్‌లో నుంచి పెట్రోల్‌ను క్యాన్‌లోకి పట్టి మళ్లీ ఇంటివద్దకు వచ్చాడు.  ఇంటి వరండాలో ఉన్న వెంకటమ్మపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.  వెంకటమ్మ కేకలు వేస్తూ వరండాలో నుంచి పరుగులు తీసింది.   ఇంటి లోపల ఉన్న రోజాతో పాటు 8 నెలల చిన్నారి  విద్యాసాగర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు. భ యంతో కేకలు వేస్తూ రోజా తన బిడ్డను బొంతలో చుట్టి మేడపై నుంచి కిందికి విసిరేసింది. 

చుట్టు పక్కల వారు రోజా ఇంటి వద్దకు చేరుకునే సరికి దట్టమైన పొగలు వ్యాపించాయి. కొంతమంది పైకి వెళ్లి మంటలను అదుపు చేస్తుండగా, మరి కొందరు బిడ్డను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోజాతో పాటు అమ్మమ్మ వెంకటమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. రోజాకు  60 శాతానికి పైగా కాలి న గాయాలయ్యాయి. 8 నెలల విద్యాసాగర్‌కు 70 శాతానికి పైగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ భార్య, బిడ్డ మృతిచెందారు. వృద్ధురాలు మృత్యువు తో పోరాడుతోంది. ఈ ఘటనపై బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కొత్తపేట పోలీ సులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement