
వస్త్ర వ్యాపారం బంద్
వస్తు, సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్
రాజమహేంద్రవరం సిటీ : వస్తు, సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వల్ల సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని, వ్యాపారులపై అ«ధికారుల ఒత్తిడి ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్లో 600 షాపులు, మెయిన్రోడ్లో 15 పెద్ద షోరూమ్లు, మిగిలిన షాపులు వెరసి 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి.
జీఎస్టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. బంద్తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు వ్యాపారాల బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు వస్త్ర హోల్సేల్ వర్తకుల సంఘం అధ్యక్షుడు బిళ్లా రాజు పేర్కొన్నారు. వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు.