చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడి

TDP leaders attack on Chevireddy Bhaskar Reddy - Sakshi

పసుపు కుంకుమ కార్యక్రమంలో ఘటన

ఎమ్మెల్యేకు రక్షణగా ఉన్న మహిళలు, పోలీసులపై రాళ్లు, కారంతో దాడి

తిరుపతి రూరల్‌: సీఎం సొంత జిల్లా చిత్తూరులో పచ్చ నేతలు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి  పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్‌ ప్యాకెట్లతో దాడి చేశారు.

దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ, ఎంఆర్‌ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడ్డారు.  ఉలిక్కిపడిన పోలీసులు గొడవ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు. సృహ తప్పిన ఎమ్మెల్యేని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చెవిరెడ్డికి శ్వాస తీసుకోవటంలోనూ, బీపీ ఇబ్బందులు రావటంతో రుయా అత్యవసర విభాగంలో వైద్య పరీక్షలు చేశారు. కాగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తున్న అధికార కార్యక్రమం పసుపు–కుంకుమను టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటూ దౌర్జన్యాలకు దిగడం మరోసారి బయటపడింది.

ఫోన్‌లో పరామర్శించిన జగన్‌: రుయాలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతోనే ఉండు, నీకు అండగా మేమున్నాం... అంటూ ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఆసుపత్రికి వచ్చి ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను తెలుసుకున్న నియోజకవర్గంలోని చెవిరెడ్డి అనుచరులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుయా ఆసుపత్రికి తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top