మళ్లీ వస్తున్నారండీ..!

TDP activists come at Janmabhoomi program - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జనాల్ని మోసగించడానికి జన్మభూమి ముసుగులో మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు విడతల జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి. పరిష్కారం చేస్తామంటూ ప్రతి విడత సరాసరి 95 వేల నుంచి లక్ష వరకు అర్జీలు స్వీకరించినా పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించలేదు. అర్జీదారులు చేసిన వినతులకు సమాధానం ఇవ్వడమే పరిష్కారంగా చూపించి చేతులు దులుపుకున్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, రుణాలు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలన్నీ జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టి అర్జీలు ఇచ్చిన వారికి మొండి చేయి చూపించారు.

 గ్రామాల్లో ఉన్న ‘పచ్చ’ కమిటీలు సిఫార్సు చేస్తేనే మంజూరు అని కొర్రీ పెట్టి అర్జీదారులను నిరాశకు గురి చేశారు. ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో జనం ముందుకొచ్చి మభ్యపెట్టి... తాజాగా నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి, భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనల పేరుతో ఆరో విడత జన్మభూమి కింద ప్రజల ముంగిటకు వస్తున్నారు. అధికార పార్టీకి ఎలా ఉన్నా జన్మభూమి కార్యక్రమం అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. నిర్వహణకు అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకోవడంతో సభ ఏర్పాట్లు, జన సమీకరణ కోసం ఆపసోపాలు పడాల్సి వస్తుందన్న భయం అధికారులకు పట్టుకుంది.

నాలుగున్నరేళ్లలో ఏమి సాధించారని...? 
రుణమాఫీపై సీఎం తొలి సంతకం చేశారు. రుణాలన్నీ మాఫీ అయిపోతాయని రైతులు భావించారు. కానీ, రైతుల్ని నట్టేటా ముంచారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రకటన నాటికి జిల్లాలో 6 లక్షల 50 వేల మంది రైతులు రూ. 13,009 కోట్ల రుణం తీసుకున్నారు. వీరందరికీ రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ గత మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 961.93 కోట్లు మంజూరు చేసింది. అంటే తీసుకున్న రుణంలో పదో వంతు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. 

∙రెండో సంతకంతో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పెట్టుబడి నిధి పేరుతో మోసగించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించినట్టుగా 89,433 సంఘాలకు రూ.1326.47 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. కానీ, అధికారంలోకి వచ్చాక ఇంతవరకు రూ.503.75 కోట్లు మాత్రమే మంజూరు చేసి, వాటిని డ్వాక్రా సంఘాల ఖాతాలకు పరిమితం చేశారు. పెట్టుబడి నిధి కింద ‘పసుపు కుంకుమ’ పేరుతో జమ చేస్తోంది. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు.పెట్టుబడి నిధి కింద ఇచ్చిన రూ.10 వేలు వారు తీసుకున్న రుణాల వడ్డీకే సరిపోలేదు. చివరికీ వడ్డీతో సహా రుణాలు మరింత తడిపిమోపెడయ్యాయి. 

ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం కల్పించలేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి కింద అందజేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 8,51,587 కుటుంబాలున్నాయి. జిల్లాలో రిజిస్టరైన నిరుద్యోగులు 90 వేల మంది ఉన్నారు. రిజిస్టర్‌ కాని నిరుద్యోగులు 3.20 లక్షల మంది ఉన్నారు. అనధికారికంగా ఉన్న వారిని పక్కన పెడితే రిజిస్టరైన నిరుద్యోగుల్నే తీసుకుంటే వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలకు పరిమితం చేసి, డిగ్రీ, డిప్లమో అభ్యర్థులకంటూ చేతులేత్తేసింది. ఇప్పుడా సంఖ్య 20 వేలకులోపే ఉంది. 

దోపిడీకి గురైన కేంద్ర నిధులు
వాడవాడలా చంద్రన్నబాటలో భాగంగా వేసిన సిమెంట్‌ రోడ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సీసీ రోడ్ల నాణ్యత ‘నేతి బీర’ చందంగా తయారయ్యాయి. బెర్మ్‌లు కూడా వేయకపోవడంతో అవి ప్రమాదకరంగా మారాయి.   కేంద్రప్రభుత్వ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల్ని సీసీ రోడ్ల రూపంలో అధికార పార్టీ నేతలు ఎంచక్కా మేసేస్తున్నారు. దాదాపు పనులన్నీ నామినేటేడ్‌ పద్ధతిలో ‘పచ్చ’నేతలకు కట్టబెడుతుండటంతో ఇష్టారీతిన  దోచుకుతింటున్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు నాసిరకం పనులపై  లోకాయుక్తకు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి,  కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌ సెల్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. బెర్మ్‌లు వేయకుండా డబ్బులు తినేశారు. జిల్లాలో గత మూడేళ్లలో 340 కోట్లతో 1380 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. ఈ లెక్కన రూ.34 కోట్లు బెర్మ్‌ల కింద ఖర్చు పెట్టాలి. కానీ, జిల్లాలో వేసిన సీసీ రోడ్లలో 20 శాతానికి మాత్రమే బెర్మ్‌లు వేసినట్టు తెలుస్తోంది. మిగతా వాటికి బెర్మ్‌లు వేయకపోవడంతో వాటికోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి.

∙స్వచ్ఛ భారత్‌లో చేపట్టిన మరుగుదొడ్లు నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అధికారులు రికార్డుల పరంగా శతశాతం పూర్తి చేశామని చెబుతున్నా అనేకచోట్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులు మింగేశారు. జిల్లాలో మూడేళ్లలో 347.33 కోట్లు ఖర్చు పెట్టగా వాటిలో రూ.100 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్టుగానే దాదాపు ప్రతి మండలంలో మరుగు దొడ్ల అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి. అవినీతితో చేపట్టిన పనులను తమ ఘనతగా చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నిర్వహణకు అరకొర నిధులు
జన్మభూమి కార్యక్రమం నిర్వహణకు కూడా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేస్తోంది. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి’ అన్నట్టుగా కొద్దిపాటి నిధులిచ్చి వాటితో పండగ చేసుకోండి అన్నట్టుగా నిధులు మంజూరు చేస్తోంది. అట్టహాసంగా నిర్వహించాలని, భారీగా జన సమీకరణ చేయాలని అధికారుల మెడపై కత్తి పెడుతోంది. దీంతో ఆ స్థాయిలో చేయడానికి అధికారులు అడ్డదారులు తొక్కాల్సి వస్తోంది.

 జిల్లాలో 64 మండలాలు, 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాల్టీలు 364 నగర పంచాయతీలు, 1069 గ్రామాలున్నాయి. వీటిలో 1433 చోట్ల వార్డులు/పంచాయతీల్లో జన్మభూమి సభలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం కేవలం రూ.కోటి విడుదల చేసింది. మరో రూ.75 లక్షల వరకు విడుదల చేస్తామని ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికైతే ఈ నిధులు ఎటూ సరిపోవు. వచ్చిన నిధులను ఇప్పటికే కేటాయింపులు చేశారు. ప్రతి మండలానికీ స్టేషనరీ కోసం రూ.30 వేలు, అద్దె వాహనం కోసం రూ.10 వేలు ఇవ్వగా, ఒక్కో గ్రామ/వార్డు సభ నిర్వహణ కోసం రూ.2 వేల చొప్పున కేటాయించారు. ఇవి ఎంత వరకు సరిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఒక జన్మభూమి సభ కోసం ఎలా చూసినా రూ.15 వేలకు పైగానే ఖర్చు జరగనుంది. ఈ లెక్కన సంబంధిత అధికారులు మిగతా మొత్తం కోసం ఏదో ఒకటి చేయక తప్పదు. 

వెబ్‌పోర్టల్‌లో కనిపించని అర్జీలు 
పారదర్శకత అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత ఐదు విడతలుగా ప్రజల నుంచి తీసుకున్న అర్జీలు, వాటి పరిష్కార వివరాలను వెబ్‌పోర్టల్‌లో లేకుండా తొలగించింది. కనీసం గత ఏడాదికి సంబం«ధించిన అర్జీలను కూడా పోర్టల్‌లో చూపించలేదు. గతేడాది ఎన్ని వచ్చాయి? ఏ శాఖ కింది, ఏ పథకం కోసం ఎన్ని వచ్చాయి? వాటిలో పరిష్కరించినవి ఎన్ని? అనే వివరాలు లేకుండా చేసింది. అధికారులు సైతం ఆ వివరాలు చెప్పడం లేదు. వెబ్‌ పోర్టల్‌లో లేవని, అక్కడే లేనప్పుడు తమ వద్ద ఎందుకుంటాయని దాట వేస్తున్నారు. 

ప్రజా సమస్యలపై నిలదీస్తాం
నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రజానీకం సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంగాని, అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గాని చొరవ చూపడంలేదు. ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీస్తాం.
– రావూరు వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ
రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి,  కాకినాడ

జన్మభూమితో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజాసమస్యలు ప్రభుత్వానికి పట్టవు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయదు. జన్మభూమి అంటూ అధికారులను జనాల్లోకి పంపి జనాలతో అధికారులు తిట్లు తినేలా చేయనుంది. ప్రజాసమస్యలపై జన్మభూమికి హాజరయ్యే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం.
– పలివెల వీరబాబు, సీపీఎం నగర కార్యదర్శి,  కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top