మున్సిపల్ కార్యాలయంలో కీలకమైన మినిట్స్ బుక్ మాయమైన వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది.
నంద్యాల టౌన్, న్యూస్లైన్: మున్సిపల్ కార్యాలయంలో కీలకమైన మినిట్స్ బుక్ మాయమైన వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సీని యర్ అసిస్టెంట్ స్వామి దాస్లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలతో చేతులు కలిపిన కొందరు అధికారులు పెట్టిన ప్రతిపాదనలు, తీర్మానాలను స్పెషల్ ఆఫీసర్ గుడ్డిగా ఆమోదించారు.
వీటికి సాక్షిగా నిలిచిన మినిట్స్ బుక్ను ఈనెల 13వ తేదీన సిబ్బంది మెయిన్ ఆఫీసులో మాయం చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కీలకమైన మినిట్స్ బుక్ను జూని యర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ అసిస్టెంట్ స్వామిదాస్ నిర్వహించేవారు. బుక్ మాయం కావడంతో ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరిని ఆర్డీ మురళీకృష్ణగౌడ్ సస్పెండ్ చేశారు. అయితే ఇందులో మరి కొందరు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మినిట్స్ బుక్ మాయంపై విచారణ కొనసాగడం లేదు. మున్సిపల్ ఆర్డీ ఇద్దరిని సస్పెండ్ చేసి, కమిషనర్ రామచంద్రారెడ్డి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు కేసు నమోదు చేయలేదని, తాము చేసేదేమి లేదని సీఐ సురేంద్రరెడ్డి చెబుతున్నారు. చివరకు మినిట్స్ బుక్ వ్యవహారం భూస్థాపితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.