పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు.
పెదబయలు: పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 650 మంది బాలురు చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వటం లేదని, తాగు నీరు సరిగా లేదని ఎన్నిసార్లు ప్రిన్సిపాల్కు చెప్పినా స్పందన లేదంటూ మంగళవారం విద్యార్థులంతా తరగతులు బహిష్కరించారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో సిబ్బంది వారించినా వారు వినలేదు. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు.