అమ్మంటే.. పెన్షన్‌ డబ్బు కాదు! | Son Negligence Mother Dies in Cold Weather | Sakshi
Sakshi News home page

అమ్మంటే.. పెన్షన్‌ డబ్బు కాదు!

Feb 1 2019 9:47 AM | Updated on Feb 1 2019 9:47 AM

Son Negligence Mother Dies in Cold Weather - Sakshi

మృతురాలు పార్వతీబాయి

‘అమ్మ’ంటే ఆట బొమ్మకాదు..అవసరాలు తీర్చే ‘ఆయా’ కానేకాదు..ప్రేమకు ప్రతి‘రూపం’.. సృష్టిలో అపురూపంతరాలు మారినా ఆధునికత పెరిగినా  మనిషిలోనైనా మట్టి ముద్దలోనైనా..  ఏ వయసులోనైనా అమ్మ దేవత.ఆకలేస్తే ఉగ్గు పాలలో అమ్మ..  నిద్దరొస్తే జోలపాట అమ్మ..దయాగుణంలో ధరిత్రిలా..  ప్రేమానురాగాల పవిత్రమూర్తి..అమ్మ శాశ్వతం.. ఆమె ప్రేమ శాశ్వతం..అమ్మ అనాథ కాదు..అద్దంలో రూపం కాదు..  మాంసం ముద్ద అసలే కాదు..‘అమ్మ’ను విస్మరిస్తే శాపం..లోకం క్షమించదు ఈ పాపం.

గుంతకల్లు: కుమారుడి ఆదరణ లేక ఓ తల్లి తనువు చాలించిన ఘటన పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రిటైర్డు ఆర్‌పీఎఫ్‌ సూర్యనారాయణ, పార్వతీబాయి(72) దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మోహన్‌రావు బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకోబ మతిస్థిమితం లేక ఊరూరు తిరిగేవాడు. ఐదేళ్ల క్రితం సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతీబాయి భర్త పెన్షన్‌తో జీవిస్తుండేది.

పెళ్లి అయిన మోహన్‌ భార్యాపిల్లలతో వేరు కాపురం పెట్టాడు. నెల నెలా మొదటి వారంలో తల్లి పార్వతీబాయిని బ్యాంకుకు పిలుచుకువెళ్లి పెన్షన్‌ సొమ్ము డ్రా చేసుకొని తల్లిని ఇంటి వద్ద వదిలివెళ్లేవాడు. ఆమె బాగోగులు పట్టించుకునే వాడు కాదు. మూడు రోజులుగా చలితీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గురువారం ఉదయం మృతి చెందింది. స్థానికులు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుమారుడు మోహన్‌ను పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement