పింఛన్ గద్దలు | some employees not distributing pensions properly | Sakshi
Sakshi News home page

పింఛన్ గద్దలు

Jan 21 2014 1:17 AM | Updated on Sep 22 2018 8:22 PM

పేదలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను కూడా అవినీతి ఉద్యోగులు గద్దల్లా త న్నుకుపోతున్నారు.

 వెంకటాపురం(ఏలూరు రూరల్), న్యూస్‌లైన్ :
 పేదలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను కూడా అవినీతి ఉద్యోగులు గద్దల్లా త న్నుకుపోతున్నారు. లబ్ధిదారులకు పింఛన్ మంజూరైన విషయం కూడా తెలియనీయకుండా కొన్ని నెలలుగా సొమ్మును బొక్కేస్తున్న వ్యవహారం వెంకటాపురం పంచాయతీలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు లబోదిబోమంటున్నారు. గ్రామంలో గతనెల పింఛన్‌దారుల నుంచి రూ.10 చొప్పున దాదాపు రూ.22 వేలు వసూలు చేసిన సిబ్బంది రెండు నెలలుగా పెన్షన్ తీసుకోని లబ్ధిదారుల పింఛన్లు సైతం కాజేస్తున్నారు.
 
 వెంకటాపురం పంచాయతీ ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న నాగమల్లి రేణుక భర్త భీమారావు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది భర్త మృతి చెందడంతో బిడ్డల పోషణ భారమై మే నెలలో వితంతువు పింఛన్‌ను కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అప్పటినుంచి పంచాయతీ సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉంది. అడిగిన ప్రతి సారీ మంజూరు కాలేదని ఆమెకు చెబుతూ వచ్చారు. మరోమారు దరఖాస్తు చేసేందుకు సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఆమె ‘న్యూస్‌లైన్’ ఎదుట తన గోడు వెళ్లగక్కింది. దీంతో ‘న్యూస్‌లైన్’ ఆమె సమస్యను మండల పరిషత్ కార్యాల యంలో పింఛన్ల పంపిణీని పర్యవేక్షించే జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్‌కు వివరించింది. ఆయన రికార్డులను పరిశీలించి రేణుకకు గత ఏడాది నవంబర్ నెలలో ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం పింఛన్ బట్వాడా పట్టిక పరిశీలించగా జనవరి నెలలో ఆమె రూ.600 తీసుకున్నట్టు ఉంది. రికార్డులో ఎన్.రేణుక నిశాని అని రాసి వేలిముద్ర వేసి ఉంది. దీంతో ఆమె తాను నిశాని కాదని.. చదువుకున్నానని చెప్పింది. తన పింఛన్‌ను ఉద్యోగులు కాజేశారంటూ ఆవేదనకు గురైంది. వెంకటాపురంలో 2,280 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి నెలకు రూ. 6,91,700 విడుదలవుతోంది. వీరిలో అసలైన లబ్ధిదారులు ఎవరో.. అన్యాయానికి గురవుతున్నది ఎందరో అధికారులే తేల్చాల్సి ఉంది.
 
 నా పింఛన్ కాజేశారు
 ఆరు నెలలుగా తిరుగుతున్నా నాకు పింఛన్ మంజూైరె ందని చెప్పలేదు. ఇప్పుడు చూస్తే నా పింఛన్ మొత్తం కాజేశారు. పెన్షన్ పత్రాల్లో నేను నిశాని అని  రాసి వేలిముద్ర వేశారు. నేను చదువుకున్నాను. నాలా అన్యాయానికి గురైనవారెందరున్నారో.    - నాగమల్లి రేణుక
 
 

Advertisement
 
Advertisement
Advertisement