షట్టర్లు శిథిలం | Sakshi
Sakshi News home page

షట్టర్లు శిథిలం

Published Sun, Sep 28 2014 1:37 AM

షట్టర్లు శిథిలం

బాపట్ల
 బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన లాకులు, షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో పొలాలకు సాగునీరు అందడం కష్టంగా మారింది.  డ్రైనేజీ ఆధునికీకరణ పనుల్లో జాప్యం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కొమ్మమూరు కాల్వ పరిధిలో బాపట్ల మండలం నరసాయపాలెం వద్దగల నల్లమడ లాకులు, షటర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బ్రిటిష్‌కాలం నాటి 15 షట్టర్లు, అనంతరం నిర్మించిన మరో పది పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటితో నీటికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకపోవడంతో దిగువ ప్రాంతాలకు సక్రమంగా నీరందడం లేదు.
  కొమ్మమూరు కాలువ కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ లాకుల వద్దకు సుమారు 69.545 కిలో మీటర్ల మేరకు విస్తరించి ఉంది. కొమ్మమూరు కాలువ మొత్తం ఆయకట్టు 2.15 లక్షల ఎకరాలు. అనధికారిక సాగు మరో 50 వేల ఎకరాల వరకూ ఉంటుంది. దుగ్గిరాల వద్ద 3600 క్యూసెక్కులు నీరు వదిలినా బాపట్ల చానల్, పీటీ చానల్‌లకు పోగా నల్లమడ లాకుల వద్దకు 1100 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ నుంచి ఈ కాల్వ 70,599 ఎకరాల ఠమొదటిపేజీ తరువాయి
 ఆయకట్టు ఉంది. ఎగువ కాలువ నీటి మట్టం 11.92 అడుగులు ఉండగా, దిగువ ఆయకట్టు 8.92 అడుగులు ఉంటుంది. ఎగువ ప్రాంతంలో కాలువ వెడల్పు 64 అడుగులుండగా, దిగువ ప్రాంతంలో 48 అడుగులుంటుంది. ఈ ప్రాంతం నుంచి నరసాయపాలెం, వెదుళ్లపల్లి, చెరుకుపల్లి ట్యాంకు కాలువ, ప్రకాశం జిల్లాలోని పెద్దగంజాం వరకూ లాకుల నుంచే నీరు వెళుతుంది. ఈ లాకుల వద్ద కనీసం ఆరు అడుగుల మేరకు నీరుంటే గానీ బాపట్ల, పీటీ చానల్‌కు నీరు పారే అవకాశం లేదు.
 రైతుల ఇక్కట్లు.: ఉప్పరపాలెం వద్ద కాలువకు మరమ్మతులు చేయకుండా షట్టర్లు ఏర్పాటు చేయడంతో అవీ శిథిలావస్థకు చేరాయి. దీంతో పంట కాలువలో ఉండే నీటికి వర్షం నీరు తోడయినప్పుడు దెబ్బతింటున్నాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కీలకమైన సమయంలో నీటి నిల్వలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆధునికీకరణకు నిధులు విడుదలైతేనే పూర్తి స్థాయిలో లాకులు, షట్టర్లకు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.



 

Advertisement
Advertisement