రాష్ట్ర విభజనకు బొత్స సత్యనారాయణే కారణమని నమ్మటం వల్లే విజయనగరంలో ఆందోళనలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ నేత సుజయకృష్ణ రంగారావు అన్నారు.
విజయనగరం : విజయనగరంలో న్యాయవాదుల అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు ఖండించారు. ఓ వైపు పట్టణంలో 30 యాక్ట్ను అమలు చేస్తూ... ఇంకా కర్ఫ్యూ వాతావరణం కొనసాగించటం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని నమ్మటం వల్లే విజయనగరంలో ఆందోళనలు జరిగాయన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తోందని సుజయకృష్ణ రంగారావు అన్నారు. నల్గొండ జిల్లాలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవటాన్ని ఆయన ఖండించారు.
కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో న్యాయవాదులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఆ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు న్యాయవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.