వాటిని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలను ఖండిస్తున్నాం
వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు అత్యంత దుర్మార్గం
ఇది చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 10న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..
ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు..
విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం.
నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు
ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతునొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు జరుగుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది.


