మహిళల భద్రతకు పూర్తి భరోసా

Sakshi Special Interview With Sunita Krishnan

‘దిశ’ బిల్లుతో దేశానికి మార్గనిర్దేశం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ 

చేతల మనిషినని ముఖ్యమంత్రినిరూపించుకున్నారు 

మహిళలను వేధిస్తే శిక్షించి తీరుతానని తేల్చిచెప్పారు 

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్‌   

సాక్షి, అమరావతి: మహిళలు, బాలల భద్రతకు భరోసానిస్తూ ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్‌ ప్రశంసించారు. మాటల మనిషిని కాదు, చేతల మనిషినని ముఖ్యమంత్రి నిరూపించుకున్నారని కొనియాడారు. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా సునీతా కృష్ణన్‌ ఉద్యమిస్తున్నారు. లైంగిక దాడుల బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు  ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం చేస్తున్న కృషికి గాను భారత ప్రభుత్వం సునీతా కృష్ణన్‌కు 2016లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర శాసన సభ శుక్రవారం ‘దిశ’ బిల్లును ఆమోదించిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. దిశ చట్టం మహిళల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనుందని చెప్పారు.  

ప్రశ్న: ఏపీ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును ఆమోదించడాన్ని ఎలా చూస్తారు?  
సునీతా కృష్ణన్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన జరిగినప్పుడు చాలామంది మాటలు చెప్పారు. కానీ, జగన్‌ మాత్రం తాను మాటల మనిషినని కాదు, చేతల మనిషినని నిరూపించారు. తల్లిదండ్రులకు ధైర్యం కలిగించారు. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కచి్చతంగా శిక్షలు పడేలా పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తున్న ముఖ్యమంత్రిని అందరం అభినందించాల్సిందే.  

ప్రశ్న: మహిళల భద్రతకు ఈ బిల్లు ఎలాంటి భరోసా ఇస్తుందని భావిస్తున్నారు?
సునీతా కృష్ణన్‌: మహిళలు, బాలలపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టం చేసేలా ‘దిశ’ బిల్లును రూపొందించారు. ఇందులో మూడు ప్రధానాంశాలు మహిళలు, బాలల భద్రతకు భరోసానిస్తున్నాయి.  

మొదటి అంశం.. నేరస్తుల రిజిస్టర్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా ఓ గొప్ప ముందడుగు ఇది. నేరస్తుల పేర్లతో ఓ రిజిస్టర్‌ నిర్వహిస్తారు. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. దీంతో నేరస్తుల్లో భయం పుడుతుంది.  

రెండో అంశం.. నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం  గొప్ప నిర్ణయం. దీంతో నిర్ణీత గడువులోగా 100 శాతం న్యాయం జరుగుతుందని బాధితులకు నమ్మకం కలుగుతుంది. ప్రత్యేక కోర్టులు, జడ్జీలు, ఇతర మౌలిక సదుపాయాలతో ఓ వ్యవస్థను నెలకొల్పనుండటం అంటే మాటలు కాదు. నేరాలను అరికట్టాలంటే ఎంత పెద్ద శిక్ష విధిస్తామన్నదే కాదు, ఎంత త్వరగా శిక్షిస్తామన్నది కూడా చాలా ముఖ్యం.   

మూడో అంశం.. మహిళలు, బాలలపై నేరాల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలకు గానీ, సంప్రదింపులకు గానీ అవకాశం ఇవ్వదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేరస్తులను తమ ప్రభుత్వం రక్షించదని తేలి్చచెప్పారు. నేరాలు జరిగితే సత్వరం విచారణ పూర్తి చేయాల్సిందే... దోషులకు శిక్షలు పడాల్సిందేనని నిబద్ధత చాటారు. ఇది చాలా మంచి విషయం.  

ప్రశ్న: దిశ బిల్లు చట్టంగా మారిన తరువాత వ్యవస్థలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయని భావిస్తున్నారు?  
సునీతా కృష్ణన్‌: దిశ బిల్లు చట్టంగా మారిన తరువాత మన క్రిమినల్‌ జ్యుడిషియరీ విధానంలో పెను మార్పులకు నాంది పలుకుతుంది. ప్రధానంగా మహిళలపై దాడులను అరికట్టడంలో కీలకమైన పోలీసు, న్యాయ వ్యవస్థలకు రాజకీయ వ్యవస్థ స్పష్టమైన సందేశాన్ని ఇచి్చంది. నేరస్తులను కఠినంగా శిక్షించి, నేరాలను కట్టడి చేయడానికి ఆ రెండు వ్యవస్థలకు మార్గం సుగమం చేసినట్టు అయ్యింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top