69 ప్రైవేట్ బస్సులు స్వాధీనం | RTA officers seized 69 private buses | Sakshi
Sakshi News home page

69 ప్రైవేట్ బస్సులు స్వాధీనం

Nov 9 2013 2:49 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం బస్సు దుర్ఘటన అనంతరం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.

దాడులు కొనసాగిస్తున్న ఆర్టీఏ అధికారులు
 సాక్షి, సిటీబ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం బస్సు దుర్ఘటన అనంతరం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సులు యథావిధిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. బస్సు ప్రమాదం తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకూ 69 బస్సులను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, నాగ్‌పూర్ హైవే, మేడ్చల్, తదితర ప్రాంతాల్లో అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
 
 స్వాధీనం చేసుకున్నవాటిలో కాంట్రాక్ట్ క్యారేజీలుగా పర్మిట్‌లు తీసుకొని స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న బస్సులే ఎక్కువగా ఉన్నాయి. చాలా బస్సుల్లో సరైన ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఎమర్జెన్సీ డోర్, అత్యవసర సమయాల్లో అద్దాలు పగులగొట్టేందుకు కావలసిన హామర్‌లు లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగాయని, వాటిపై కేసులు నమోదు చేసి బస్సులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ మేరకు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ సి.రమేష్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement