
బంగారం చోరీ ముఠా గుట్టు రట్టు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాజుల మండెం 70 తులాల బంగారం చోరీ కేసు ఓ కొలిక్కి వచ్చింది.
చిత్తూరు : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాజుల మండెం 70 తులాల బంగారం చోరీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం రేణిగుంట పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించే క్రమంలో.. తీగ లాగితే డొంక కదిలినట్లు చోరీ వివరాలు బయటపడ్డాయి. దాంతో ఈ నెల 21వ తేదీ సాయంత్రం చోరీకి గురైన 70 తులాల బంగారు ఆభరణాలకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన బాదుషావలితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చోరీ వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజుల మండెం నక్కల కాలనీకి చెందిన బంగారు వ్యాపారి సరుకు తేవడానికి చెన్నై వెళ్లి వస్తాడనే విషయం తెలిసిన అదే షాపులో పనిచేస్తున్న బాదుషావలి ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం వేశాడు. దీనికోసం పన్నెండు మందితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. పథకం ప్రకారం వ్యాపారి ఉన్న ఆటోలో ఎక్కిన వీరు ఆటో డ్రైవర్ను చితకబాది వ్యాపారి వద్దనున్న నగలతో ఉడాయించారు. ఈ కేసు విషయమై నాలుగు రోజులుగా గాలింపు చేపడుతున్న పోలీసులు మంగళవారం కేసును ఛేదించారు. దొంగిలించిన బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.