కర్నూలు హైవేపై ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 7:07 PM

Road Accident On Kurnool Highway - Sakshi

సాక్షి, కర్నూలు : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు పంక్చర్‌ అయ్యింది. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ ప్రొఫెసర్‌ ప్రయాణిస్తున్న కారుని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రొఫెసర్, అతని భార్య, డ్రైవర్‌లు అక్కడికక్కడే మృతి చెందగా..ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న కార్తీక్, తేజేష్, రాకేష్, శేఖర్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా, మృతుడు శివభూషణానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  

Advertisement
Advertisement