ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని
భవానీపురం : ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్తోతుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు ఎవరి బాధ్యతను వారు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అండగా తల్లిదండ్రులు కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండి పిల్లలను ప్రోత్సహించాలని చెప్పారు.
పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు అయ్యేలా చదివించాలని, ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషి చేయాలని సూచించారు. వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయులు రానున్న పరీక్ష విధానంలో విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలి, చివరి నిమిషం అయినప్పటికీ వెనుకబడిన వారిని ప్రోత్సహించి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) జి. నాగరాజు, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె. దుర్గాప్రసాద్, స్కూల్స్ సూపర్వైజర్ ఎం.వి. వెంకటేశ్వరరావు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.