ఎంత డబ్బు అయినా సరే బాలుడిని బతికించండి

Rachamallu Shiva Prasad Reddy Visit Injured Boy in Hospital - Sakshi

నూనెలో పడి గాయపడిన బాలుడిని బతికించండి

వైద్యులను కోరిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి  

ప్రొద్దుటూరు : మీరు డబ్బు కోసం వెనుకాడాల్సిన అవసరం లేదు. ధనవంతుల పిల్లలకు ఎలాంటి చికిత్స చేయిస్తారో అలాగే చికిత్స చేసి గాయపడిన బాలుడిని బతికించండి.. అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వైద్యులను కోరారు. ఆ బాలుడికి అయ్యే ఖర్చును తాను భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన శివప్రసాద్, ప్రియాంకలు ఇటీవల అమృతానగర్‌లో స్థిరపడ్డారు. కాగా పది రోజుల క్రితం వీరు అయ్యప్ప స్వాములకు భోజనం ఏర్పాటు చేసేందుకు వంటలు చేసే పనిలో ఉన్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు భువనేశ్వర్‌ ఆడుకుంటూ వెళ్లి నూనె గోళంలో పడటంతో శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. వీరు బాలుడిని బతికించుకునేందుకు వేలూరు, తిరుపతి ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లారు.

ప్రస్తుతం ప్రొద్దుటూరులోని నాగదస్తగిరిరెడ్డి ఆస్పత్రిలో చేరారు. సోములవారిపల్లె మాజీ సర్పంచ్‌ శేఖర్‌ యాదవ్‌ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బుధవారం ఆస్పత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులు నాగదస్తగిరిరెడ్డి, టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడుతూ పిల్లాడిని బతికించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాగైనా బాలుడిని బతికించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుడి తల్లిదండ్రులు దొమ్మర సంఘానికి చెందిన నిరుపేదలు అని అన్నారు. వారిని తప్పకుండా తాను ఆదుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ రమణయ్య, సెల్‌ సుబ్బయ్య పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top