ప్రభుత్వ ఉద్యోగులే సైకాలజిస్టులుగా... | Psychologists as Government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులే సైకాలజిస్టులుగా...

Jun 7 2016 2:15 AM | Updated on Sep 4 2017 1:50 AM

సైకాలజీ విద్యను అభ్యసించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని సైకాలజిస్టులుగా నియమించాలని...

తిరుపతి కార్పొరేషన్: సైకాలజీ విద్యను అభ్యసించి ప్రభుత్వ శాఖల్లో  ఉద్యోగాలు చేస్తున్న వారిని సైకాలజిస్టులుగా నియమించాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా చిత్తూరు జిల్లా కన్వీనర్ వీర కిరణ్ డిమాండ్ చేశారు. ఈనెల 4,5 తేదీల్లో విజయవాడలో ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -ఇండియా ఆధ్వర్యంలో సైకాలజిస్టుల జాతీయ మహాసభలు నిర్వహించారు.  జిల్లా కన్వీనర్ వీర కిరణ్ మహాసభలో చేసిన డిమాండ్లను సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ప్రజల మానసిక  ప్రవృత్తులు, చెడు అలవాట్లు-వ్యసనాలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నాయన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థ, విద్యార్థులపై ఒత్తిడి పెంచి  ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోందని విమర్శించారు. సైకలాజికల్ కౌన్సిల్ అవసరాన్ని ప్రజలు గుర్తించినా, ప్రభుత్వం గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం బాధాకరమన్నారు.  

ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే సైకాలజిస్టుల జాతీయ మహాసభలను నిర్వహించామన్నారు.  సమావేశంలో పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రధానంగా సైకాలజిస్టు కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, సైకాలజి అధ్యాయనాన్ని వృత్తి విద్య కోర్సులుగా గుర్తించాలని ఇందులో పేర్కొన్నారు. సైకాలజిస్టులను డాక్టర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement