టీడీపీ పా‘పాలు’

Private Dairies are Exploiting Dairy Farmers in Kadapa - Sakshi

గత ప్రభుత్వ తీరుతో పాడిరైతుకు నష్టాలు 

గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు డెయిరీల మొండి చేయి

వెన్నశాతం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు

జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి.పాలకు గిట్టుబాటు ధర కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి.దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యం కలిగి ఉందని పాడిరైతులు ధ్వజమెత్తుతున్నారు. 

సాక్షి, కడప : జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది పంటల సాగుతో పాటు పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు పండకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485, పాలిచ్చే బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25, 900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది.

అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. 

నిలువు దోపిడీ...
పాడి రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు పాల్పడుతూ వస్తున్నాయి. గిట్టుబాటు ధర కల్పించడంలో చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు సాలీడ్‌ నాన్‌ ఫ్యాట్‌ (ఎస్‌ఎన్‌ఎఫ్‌), ఫ్యాట్‌ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, అందులోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్‌ఆర్‌) ఆధారంగా ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.5 శాతం, ఫ్యాట్‌ 4.5 మేరకు రీడింగ్‌ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 30 మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి.ఇవి రోజుకు 1,35,856 లీటర్ల నుంచి 1,42,716 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. 

చంద్రబాబు స్వలాభం కోసం విజయా డెయిరీ నిర్వీర్యం...:
జిల్లాలో తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999 , 2014లో తన సొంత హెరిటేజ్‌ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్‌ డెయిరీకి పాలను మళ్లించుకున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ పాలనా కాలంలో పాడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. బాబుగారి హెరిటేజ్‌ సంస్థ లీటరు పాలను ఎన్నికల ముందు వరకు రూ.52లతో ప్యాకెట్‌ను విక్రయించారు. ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54 చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్‌ ధర రూ.58 చేశారు. మిగతా డెయిరీలు కాసింత తక్కువగా అంటే లీటరు రూ.54–56 ధరతో విక్రయిస్తున్నాయి. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.30 నుంచి 35లకు కొనుగోలు చేసి లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు. 

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో పాడి రైతు తేజోమయం...
2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి పేద రైతులకు అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చేయించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకాల మందులు ఇచ్చేవారు. ప్రతి నెలా పశువైద్య శిబిరాలు నిర్వహించి పాడి పశువులు ఆరోగ్యంగా ఉండేలా చేశారు. మొత్తం 1.20 లక్షల లీటర్లు విజయా డెయిరీ వారు పాలసేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది.

పోషణ భారంగా మారింది..
ప్రైవేట్‌ డెయిరీలు పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. విధలేనిపరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించడంతో మళ్లీ ప్రాణం లేచివచ్చినట్లే. ప్రైవేటు డెయిరీలను కట్టడి చేస్తూ ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీ పాలను సేకరించేలా చూడాలి.
– కె.చిన్నమ్మ, పాడిరైతు, ఎస్‌ సోమవరం, సంబేపల్లె మండలం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top