తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీ జరుగుతుందని, దీనిపై అపోహ పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
వినుకొండ: తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీ జరుగుతుందని, దీనిపై అపోహ పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ఈ నెల 22న వస్తుందన్నారు.
అన్ని రకాల వ్యవసాయ రుణాలు, గోల్డ్ లోన్స్ మాఫీ చేస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వినుకొండ అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు.
ప్రత్యేక హోదా కల్పిస్తే నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తేనే ప్రమోటర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మార్కెటింగ్ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు.