ఉమ్మి వేశాడని చితకబాదిన పోలీస్‌ | Sakshi
Sakshi News home page

ఉమ్మి వేశాడని చితకబాదిన పోలీస్‌

Published Wed, Nov 7 2018 7:20 AM

polioce Atack On Man While Spit On Car Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): తన కారుపై ఉమ్మి వేశాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసు ఉద్యోగి చితకబాదాడు. తాళ్లతో కట్టి మరీ వాతలు వచ్చేలా కుటుంబ సభ్యులంతా కలిసి కొట్టారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్మా క్యాంప్‌ ప్రాంతానికి చెందిన పొలమర శెట్టి మాధవరావు సోమవారం రాత్రి కంచరపాలెంలో ఉన్న తన దుకాణాన్ని మూసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ క్వార్టర్స్‌ వద్ద రోడ్డుపై పార్కింగ్‌ చేసి ఉన్న తన కారుపై ఉమ్మి వేశాడని నెపంతో శ్రీనివాసరావు అనే పోలీసు ఉద్యోగితోపాటు అతని కుటుంబ సభ్యులంతా కలిసి అత్యంత దారుణంగా మాధవరావును తాళ్లతో కట్టి కొట్టారు.

రాత్రి 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు కొడుతునే ఉన్నారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితుడు మాధవరావును విడిపించి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో తన పర్సు, షాపు తాళాలు, ద్విచక్రవాహనం తీసుకున్నారని బాధితుడు వాపోతున్నాడు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అకారణంగా దాడి చేసి కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement
Advertisement