పోలీసుల ఓవర్ యాక్షన్ | police over action | Sakshi
Sakshi News home page

పోలీసుల ఓవర్ యాక్షన్

Aug 7 2014 3:14 AM | Updated on Oct 17 2018 6:34 PM

వైఎస్సార్‌సీపీ నేతపై తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించినందుకు బుధవారం పోలీసులు ఓవరాక్షన్ చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు
 వింజమూరు : వైఎస్సార్‌సీపీ నేతపై తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించినందుకు బుధవారం పోలీసులు ఓవరాక్షన్ చేశారు. దీంతో స్థానికంగా పరిస్థితి చినికిచినికి గాలివానగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో 20 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అసాల్ట్ (దౌర్జన్యం) కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మండలంలోని నేరేడుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గురజాడ వీరయ్యపై మే 16న నమోదైన ఓ కేసులో బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్సై కె.తిరుపతయ్యను అడిగారు. దీనికి ఎస్సై దురుసగా సమాధానం చెప్పడంతో వైఎస్సార్‌సీపీ నేతలకు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
 
 20 మందిపై అసాల్ట్ కేసు నమోదు
 గురజాల వీరయ్య అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల అదుపు లో ఉన్న అతన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లిన 20 మందిపై పోలీస్ అసాల్ట్ కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసేందుకు సీఐలు ఏవీ రమణ, ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామన్నారు. వీరిపై ఉన్న పాత కేసుల్ని పరిగణనలోకి తీసుకుని అవసరమైతే రౌడీషీట్‌ను కూడా తెరుస్తామన్నారు.
 
 ముమ్మరంగా గాలింపు
 వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో పోలీసులు హడావుడి చేశారు. కావలి సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులు వింజమూరులోనే ఉండి బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లు, పంచాయతీ కార్యాలయాలు, తదితర చోట్ల గాలింపు చేపట్టారు. నేతల సెల్ సిగ్నల్స్ నెల్లూరు లొకేషన్ చూపిస్తుండంతో కావలి టౌన్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓ బృందం  కోసం నెల్లూరులో గాలిస్తున్నారు.
 
 అడగటానికే వెళ్లాం :
 వైఎస్సార్‌సీపీ నేత గణపం బాలకృష్ణారెడ్డి
 వైఎస్సార్‌సీపీ నేత గురజాల వీరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఎస్సైను అడగటానికి స్టేషన్‌కు వెళ్లామని వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి తెలిపారు. అతన్ని ఎందుకు అరెస్ట్ అడిగామన్నారు. వీరయ్యను మళ్లీ తీసుకుని వస్తామంటే విడిచి పెట్టారన్నారు. తాము దౌర్జన్యానికి గాని, వాదనకు గాని దిగలేదన్నారు. కేవలం అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి తమపై కేసులు నమోదు చేశారన్నారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలవడం కోసం స్టేషన్‌కు వెళ్లామే కానీ, దౌర్జన్యం కోసం కాదన్నారు. 34 ఏళ్ల తమ రాజకీయ జీవితంలో ఏనాడూ అధికారులకు ఇబ్బంది కలిగించ లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement