విద్యార్థి ఆత్మహత్యపై.. పోలీసు విచారణ | police enquiry started on ragging death in nellore district | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్యపై.. పోలీసు విచారణ

Aug 1 2015 8:55 PM | Updated on Aug 21 2018 7:18 PM

శ్రీగాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యపై అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు శనివారం కళాశాలలో విచారణ నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థి మధువర్ధనరెడ్డి ఆత్మహత్యపై అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు శనివారం కళాశాలలో విచారణ నిర్వహించారు. ర్యాగింగ్ వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. తొలుత కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు, ముత్తుకూరు ఎస్సై శ్రీనివాసరెడ్డిలతో ఆత్మహత్య ఘటనపై చర్చించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్, క్యాంపస్ ఇన్‌చార్జ్ శ్రీరాములురెడ్డి, రూమ్‌మేట్స్‌ను విడివిడిగా విచారించారు.

విచారణ పూర్తయితేనే వివరాలు వెల్లడవుతాయని డీఎస్పీ రామాంజనేయులు విలేకరులతో చెప్పారు. మధువర్ధన్‌రెడ్డి నిద్రిస్తుండగా సీనియర్ విద్యార్థులు దుప్పటి కప్పి తీవ్రంగా కొట్టినట్టు తండ్రి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

శ్రీగాయత్రి కళాశాల విద్యార్థి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసి వివిధ ప్రాంతాల నుంచి శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పిడతాపోలూరుకు చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement