దాచేపల్లిలో పోలీసుల కూంబింగ్‌

Police Coombing In Guntur - Sakshi

పొలాలు, మైదాన ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు

మావోయిస్టుల వాల్‌ పోస్టర్ల నేపథ్యంలో చర్యలు

పోలీసుల బూట్ల చప్పుళ్లతో దాచేపల్లి ప్రాంతం దద్దరిల్లింది. తుపాకులు ధరించిన పోలీసులు దాచేపల్లి మండలంలో శుక్రవారం మావోయిస్టుల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. పొలాలు, మైదాన ప్రాంతాలను జల్లెడపట్టారు. వడ్డీవ్యాపారులు, రేషన్‌ బియ్యం మాఫియాను హెచ్చరిస్తూ దాచేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం గోడకు పోస్టర్లు వెలసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్‌ చేపట్టారు. 

గుంటూరు, దాచేపల్లి :  పల్నాడు ప్రాంతంలో మళ్లి కూంబింగ్‌ అలజడి ప్రారంభమైంది. మావోయిస్టు పార్టీ పల్నాడు రీజియన్‌ కమిటీ పేరుతో దాచేపల్లిలోని బీసీ కాలనీ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం గోడకు రెండు పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో అధిక వడ్డీ వ్యాపారులు, రేషన్‌ మాఫీయాను హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దాచేపల్లి మండల పరిధిలో శుక్రవారం విస్తృతంగా కూంబింగ్‌  చేపట్టారు. ఏఎన్‌ఎస్‌  పోలీసులు దాచేపల్లిలోని పలు ప్రాంతాల్లో జల్లెడ పట్టి కేసానుపల్లి, తక్కెళ్లపాడు, పెదగార్లపాడు, నడికుడి గ్రామాల్లోని పొలాల్లో ముమ్మరంగా కూంబింగ్‌  చేశారు. పొలాల వెంట విస్తృతంగా తనిఖీలు చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు. కూంబింగ్‌ చేస్తున్న పోలీసులను పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు ఆశ్చర్యంగా చూశారు. నాగులేరు వెంబడి కూడా కూంబింగ్‌  చేశారు. చాలాకాలం తర్వాత పోలీసులు మండల పరిధిలో కూంబింగ్‌ చేయటంతో ప్రజలు చర్చించుకుంటున్నారు.

పోస్టర్ల ప్రింటింగ్‌పై పోలీసుల ఆరా :దాచేపల్లిలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గోడకు అంటించిన పోస్టర్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పోస్టర్లను ఎవరు అంటించారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తున్నది ఎవరు.. రేషన్‌ మాఫీయాకు అండగా ఉంటున్న రాజకీయ నాయకుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. గోడకు అంటించిన పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ పోస్టర్లు ఎక్కడ ప్రింటింగ్‌ చేశారనే దానిపై కూడా ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌రఫీ ఆరా తీస్తున్నారు.

దాచేపల్లి, నారాయణపురంలోని పలు ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులతో శుక్రవారం మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ పోస్టర్లను స్థానికంగా ప్రింటింగ్‌ చేశారా.. ఇతర ప్రాంతాల్లో ప్రింట్‌ చేసి ఇక్కడకు తీసుకువచ్చి అంటించారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

ఆందోళన చెందాల్సినఅవసరంలేదు
దాచేపల్లిలో వెలసిన మావోయిస్టుల పోస్టర్లపై ఆరా తీస్తున్నాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. ముందస్తుగానే విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాం.–ప్రసాద్, గురజాల డీఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top