మద్యం మత్తులో, పాత గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోడికత్తితో దాడిచేయడంతో గాయపడిన
పేగులు బయటపడి మృత్యువుతో
పోరాడుతున్న రామకృష్ణ
తనను తాను గాయపర్చుకుని
ఆసుపత్రిలో చేరిన రమణయ్య
జంగారెడ్డిగూడెం : మద్యం మత్తులో, పాత గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోడికత్తితో దాడిచేయడంతో గాయపడిన వ్యక్తి పేగులు బయటకు వచ్చి మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రాజరాజేశ్వరి థియేటర్ సమీపంలోని ముత్తరాసిపేటలో గురువారం ఒక ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్తరాసిపేటలోని బంధువులంతా దీనికి హాజరయ్యారు. వీరిలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల సమయంలో వాసుబోయిన రమణయ్య భోజనానికి కూర్చొన్నాడు. మారుబోయిన రామకృష్ణ భోజనాలు వడ్డిస్తున్నాడు. వడ్డన సమయంలో రామకృష్ణ, రమణయ్యల మధ్య మాటామాటా పెరిగింది.
అంతేగాక వీరిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాసుబోయిన రమణయ్య కోడికత్తి తీసుకుని రామకృష్ణ కడుపులో పొడిచి చీరేశాడు. దీంతో రామకృష్ణ పేగులు బయటపడ్డాయి. వెంటనే అతన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాసుబోయిన రమణయ్య తాను దాడిచేసిన కత్తితోటే తన చేతిపైన, కాలిపైన పొడుచుకుని తనను రామకృష్ణే పొడిచాడని ఆసుపత్రికి చికిత్సకు వెళ్లాడు. రమణయ్యకు చికిత్స చేసిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామకృష్ణకు ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమించడంతో ఏలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.