58,99,065 మందికి పింఛన్లు

Pensions Distribution to home for 58,99,065 People - Sakshi

రాష్ట్రంలో భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య 

గత నెలతో పోల్చితే 4.30 లక్షల పెరుగుదల 

నెలన్నర వ్యవధిలో 7.41 లక్షల మందికి కొత్త పింఛన్లు 

నేడు ఆదివారమైనా ఒక్కరోజులోనే పంపిణీ చేసేలా ఏర్పాట్లు

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 14,44,330 పెరిగిన పింఛన్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్య 58,99,065కు చేరుకుంది. ఫిబ్రవరిలో 54,68,322 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ లెక్కన గత నెలతో పోల్చితే 4,30,743 పింఛన్లు పెరిగాయి. నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం 7.41 లక్షల మందికి (ఫిబ్రవరిలో 6.14 లక్షలు, మార్చిలో 1,27,207 లక్షలు) కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. మార్చి 1వ తేదీ అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నాని కల్లా వంద శాతం పంపిణీ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేయాలని సూచించామని చెప్పారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్‌ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచించామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top