వారికేనా వేతనాల పెంపు? | pay hikes? | Sakshi
Sakshi News home page

వారికేనా వేతనాల పెంపు?

Oct 16 2015 11:31 PM | Updated on Sep 3 2017 11:04 AM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో....

జీవో 224, 225లపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కలవరం
కేవలం పారిశుధ్య కార్మికులకే పెరిగిన వేతనం
సమ్మె చేసినా ఇతరులకు దక్కని ప్రయోజనం

 
విశాఖపట్నం సిటీ : ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 224, 225లపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 224 జీవో ప్రకారం కేవలం పారిశుధ్య కార్మికుల జీతాలను మాత్రమే పెంచుతున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఆ 15 రోజులు సమ్మె చేసినా, వారికి జీతాలు పెంచుతున్నట్టు జీవోలో పేర్కొనలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సమ్మెకు దిగితే కేవలం పారిశుధ్య కార్మికులకే జీతాలు పెంచడాన్ని తప్పుబడుతున్నారు.

తాజా జీవోల వల్ల జీవీఎంసీ ప్రజారోగ్య శాఖలోని 5,019 మంది పారిశుధ్య కార్మికులకురూ. 8,300 నుంచి రూ. 11 వేలకు జీతాలు పెంచారు. ఇదే శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్లు, ఎన్‌ఎన్‌ఎంలు, యూసీడీ, నీటి సరఫరా విభాగంలో టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా పలు శాఖల్లో పనిచేస్తున్న వారికి రూపాయి కూడా పెరగకపోవడంతో ఉసూరుమంటున్నారు. జీవీఎంసీతో పాటు వుడాలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లు, పార్కుల నిర్వాహకులున్నారు. వారికి కూడా ఈ జీవోల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు కూడా ఎప్పటి నుంచి జీతాలు ఇవ్వాలో ఎక్కడా ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement