పోలీస్స్టేషన్లో కూర్చున్న ఉపాధ్యాయులు
ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డ ఔట్ సోర్సింగ్ గురుకుల ఉపాధ్యాయులు
గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద 15 రోజులుగా ఉద్యమం
అణగదొక్కేందుకు బాబు ప్రభుత్వం కుట్ర
కాపుకాసి వచ్చినవారిని వచ్చినట్లు నిర్బంధం
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు కోల్పోయి నెలల తరబడి న్యాయం కోసం పోరాడుతున్న ఔట్సోర్సింగ్ గురుకుల ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణికి ఇటీవల వారు వినతిపత్రాన్ని అందించడానికి ప్రయత్నించడం, ఇందుకు నిరాకరిస్తూ ఆమె కాన్వాయ్ ముందుకు దూసుకుపోవడం అలాగే మంత్రి నారా లోకేశ్ నివాసానికి వెళ్లి న్యాయం చేయాలని కోరదామని బాధితులు సిద్ధమవుతుండడం దీనికి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న గిరిజన ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించడంతో గత 15 రోజులుగా తాడేపల్లి పట్టణ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని మరుసటి రోజు వారి డిమాండ్ల సాధన కోసం మళ్లీ అక్కడికి వచ్చి తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం కూడా నిరసన ఉద్యమానికి వచ్చిన వీరిని వచ్చిన వారిని వచ్చినట్లు ఉదయం 6 గంటల నుంచే తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కొంతమందిని ప్రకాశం బ్యారేజ్ వద్ద, మరికొంతమందిని ఉండవల్లి అమరావతి కరకట్ట వద్ద వెంబడించి మరీ అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన అరెస్ట్ల పర్వం 9 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. మొత్తం 50 మందిని అరెస్ట్ చేయగా, 46 మందిని తాడేపల్లి పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు.
మిగిలిన నలుగురిని తుళ్ళూరు పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లినట్లు సమాచారం. అరెస్టయిన ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మహిళలున్నారు. ఒక ఉపాధ్యాయురాలు నీరసం వచ్చి పోలీస్స్టేషన్లో ఉన్న బల్లపై పడిపోయింది. 15 గంటలు పోలీసుల నిర్బంధంలో గడిపిన వీరికి రాత్రి 9 గంటలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, అరెస్టు అయిన ఉపాధ్యాయులు కనీసం వాష్రూమ్లు, నీళ్లులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


