ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు | Non-stop illegal sand mining | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు

Jun 11 2015 2:57 AM | Updated on Sep 3 2017 3:31 AM

నూతన ఇసుక విధానం వచ్చినా... నివగాం సమీప వంశధార నదిలో రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

నూతన ఇసుక విధానం వచ్చినా... నివగాం సమీప వంశధార నదిలో రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనివెనుక ‘ఉపాధి’ పథకంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తుండగా, అక్రమ తవ్వకం దారుల నుంచి.. దేవుడి పేరిట వసూళ్లకు పాల్పడుతూ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 కొత్తూరు: మండలంలోని నివగాం గ్రామ సమీప వంశధార నది వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతన్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. తవ్వకందారుల నుంచి కొం తమంది దేవుడు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తంతుపై ‘సాక్షి’లో పలు దఫాలు కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అక్రమ తవ్వకాల దందా రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో రోజూ వేలాది రూపాయులను దేవుడు పేరుతో కొంత మంది జేబులు నింపుకుంటున్నారు.
 
 సూత్రధారి ఈయనే....
 అక్రమ వసూళ్ల వెనుక గ్రామంలో ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నివగాంలో పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇసుక తవ్వకందారుల నుంచి కొందరు రోజూ కొంతమొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నా రు. వీరిని ఇటీవల గ్రామస్తులు కొందరు నిలదీయంతో పెద్ద వివాదమే ఏర్పడిం దని, అయినా ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడంలేదని చెబుతున్నారు. దేవుడి పేరిట వసూలు చేస్తున్న మొత్తంలో కొం త సంబంధిత అధికారులకు చెల్లిస్తున్నామని, తవ్వకాలను ఎవ్వరూ అడ్డుకోలేరని సదరు అక్రమ తవ్వకందారులు బరి తెగించి చెబుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. రెండు నెలల నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఇంత వరకు పోలీస్, రెవెన్యూ అధికారుల నిఘాలేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక లోడ్లను పట్టపగలే బహిరంగంగా తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడం  అనుమానాలకు తావిస్తోంది.
 
 చర్యలు తీసుకుంటా...
 నివగాం వద్ద జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రాతపూరకంగా ఫిర్యాదు అందితే  పరిశీలించి తగు చర్యలు తీసు కుంటానని కొత్తూరు తహశీల్దార్ డి. చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే  అందిన సమాచారం మేరకు నిఘా వేయాలని వీ ఆర్వో, వీఆర్‌ఏలను ఆదేశించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement