‘గుంతలు’ తీసిన బంట్లు | Illegal mining is taking lifes of Common People | Sakshi
Sakshi News home page

‘గుంతలు’ తీసిన బంట్లు

May 29 2026 5:31 AM | Updated on May 29 2026 5:31 AM

Illegal mining is taking lifes of Common People

ఓబులనాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌ కోసం తీసిన క్వారీ గుంతలు

ఉసురు తీస్తున్న అక్రమ మైనింగ్‌

ప్రజలను బలి తీసుకుంటున్న క్వారీ గుంతలు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ ప్రజల ఉసురు తీస్తోంది. క్వారీ గుంతల్లో పడి అమాయకులు బలైపోతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్‌ వల్ల గుంటూరు జిల్లా నాయుడుపేటలో రెండు రోజుల కిందట క్వారీ గుంతలో పడి ముక్కుపచ్చలారని చిన్నారి ఆనంద్‌(6) అసువులుబాశాడు. అయినా అధి­కా­­రపార్టీ నాయకులు అక్రమ మైనింగ్‌ ఆపడం లేదు. అధికారం మాది అడిగే­వాడెవడు అనే చందంగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములనే తేడా లేకుండా తవ్వకాలకు తెగబడుతున్నారు. రూ.కోట్లకుకోట్లు దండుకుంటున్నారు. ఎవరైనా అడ్డువస్తే అధికారులనైనా సరే చెప్పింది చాలు వెళ్లు అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి కప్పం కడితే చాలు అనుమతుల్లేకుండా ఎక్కడైనా యథేచ్ఛగా తవ్వుకోవచ్చునని విర్రవీగుతున్నారు. కనీస రక్షణ చర్యలు పాటించడం లేదు.

గతంలోనూ ఎందరో బలి!
గుంటూరు రూరల్‌ మండలంలో జరుగుతున్న క్వారీ మైనింగ్‌కు అమాయకులు బలవుతు­న్నా­రు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కృష్ణా పుష్కరాల సమయంలో నాయుడుపేట సమీపంలో నిర్వహించిన అక్రమ క్వారీలో ఈత కోసం దిగి ఐదుగురు ప్రత్తిపాడు మండలానికి చెందిన చిన్నారులు మృత్యువాత  పడ్డారు.

గతేడాది నాయుడుపేటకు చెందిన ఒక యువకుడు రాత్రి సమయంలో బయటకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి పడి మృతి చెందాడు. 
⇒ ఆరు నెలల క్రితం ఇదే అక్రమ క్వారీల్లో చౌడవరం సీఆర్‌ కాలనీకి చెందిన ఒక యువకుడు ప్రమాదవశాత్తూ జారిపడి మరణించాడు. 
⇒ మూగజీవాలూ క్వారీ గుంతల్లో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి.

నిరంతరాయంగా దందా 
గుంటూరు రూరల్‌ మండలంలోని ఓబులనా­యుడు­పాలెం, నాయు­డుపేట, వెంగళాయపాలెం, చిన్నపల­క­లూరు, గోరంట్ల, ప్రత్తి­పా­డు మండలం నడింపాలెం పంచాయతీ పరిధిలో పగలూరాత్రీ తేడాలేకుండా అక్రమ గ్రావెల్‌ దందా జరుగుతోంది. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతోంది. ప్రజాప్ర­తినిధి అల్లుడే ఈ తవ్వకాలు జరిపిస్తున్నట్లు సమా­చారం. ఏ­కంగా ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు తరలి­స్తున్న వాహనాల లెక్కలు రాసుకునేందుకు వస్తున్నా­రు. గ్రావెల్‌ లారీ ఒక్కొక్కటి రూ.8–10 వేల­కు విక్ర­యిస్తున్నారు. దీనికోసం 100 అడు­గులకు­పైగా లోతు­గా గోతులు తవ్వుతున్నారు. వీటి­వద్ద ఎటువంటి హె­చ్చ­రికలూ లేకపోవడం, వర్షం పడి­నప్పుడు వీటిల్లో నీరు చేరడంతో ప్రజలు ప్రమా­దవ­శాత్తూ పడి మృత్యు­వాత పడుతున్నారు.  

అక్రమ మైనింగ్‌ అడ్డా వడ్డమాను
తుళ్లూరు మండలంలో వడ్డమాను అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నిర్వా­హకులు, టీడీపీ నాయకులు కలిసి ఈ దందాకు తెగ­బడు­తున్నారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లోనూ య­థేచ్ఛ­గా అక్రమమైనింగ్‌ సాగుతోంది. స్థానిక టీడీపీ ప్ర­జాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. యడ్ల­పా­డు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లోనూ రాత్రి సమయాల్లో మైనింగ్‌ జరుగుతూనే ఉంది.  

అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్‌సీపీ పోరాటం 
అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్‌సీపీ అలుపెరగని పో­రా­టం చేస్తోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ విషయంపై జనసేన నాయకులూ మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లోనూ టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ అక్రమ మైనింగ్‌పై పవన్‌ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement