
నూతన సంవత్సర కానుక
వరంగల్ నగరంతోపాటు ఇటీవల విలీనమైన గ్రామాల ప్రజలకు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కొత్త సంవత్సర కానుకను ప్రకటించింది.
విస్తరించనున్న బల్దియా సేవలు
=పరిపాలనా సౌలభ్యానికి వికేంద్రీకరణ
=కాశిబుగ్గ, కాజీపేటలో సర్కిల్ కార్యాలయాలు
=అధికారులు, ఉద్యోగుల నియామకం
=జనవరి నుంచి అందుబాటులోకి సర్వీసులు
=ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ సువర్ణ పండాదాస్
కార్పొరేషన్, న్యూస్లైన్ : వరంగల్ నగరంతోపాటు ఇటీవల విలీనమైన గ్రామాల ప్రజలకు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కొత్త సంవత్సర కానుకను ప్రకటించింది. గ్రేటర్ను దృష్టిలో పెట్టుకుని పరిపాలన సవ్యంగా సాగేందుకు కమిషనర్ పలు మార్పులు, చేర్పులు చేశారు. క్షేత్రస్థాయి నుంచే సుపరిపాలన అందించాలనే ఆశయంతో కీలక ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి కిషన్ ఆదేశాలతో ప్రజల ముంగిట్లో సేవలందించేందుకు కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల నిర్వహణకు కమిషనర్ సువర్ణ పండాదాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా నాలుగు సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... ప్రభుత్వం నుంచి రెండింటికే అనుమతులు ఉన్నాయి. అనధికారికంగా నిర్వహించాలనుకున్నా... సొంత భవనాలు లేవు. దీంతో కాశిబుగ్గలోని ఐడీఎస్ఎంటీ కాంప్లెక్స్లో ఒకటి, కాజీపేటలోని మినీమునిసిపల్ కార్పొరేషన్లో మరో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా ఈ రెండు సర్కిళ్లకు అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ అంతర్గత బదిలీలు చేశారు. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త సంవత్సరం నుంచి సేవలందేలా ఏర్పాట్లను వేగవంతం చేశారు.