సాక్షి, హనుమకొండ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. నరహరి భార్యతో పాటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగారు. సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.
1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు.


