కొత్త గవర్నర్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అధికారిక నివాసం రాజ్ భవన్ను ముస్తాబు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచే గవర్నర్ కొత్త రాజ్ భవన్లో నివాసం ఉంటారని జేఏడీ కార్యదర్శి సిసోడియా తెలిపారు. బెజవాడలో రాజ్ భవన్గా ఖరారు చేసిన ఇరిగేషన్ భవనాన్ని గురువారం గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, సిసోడియాతో కలిసి పరిశీలించారు. అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్కు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఒక దర్బార్ హాల్, ఒక మీటింగ్ హాల్, ఏడు బెడ్ రూమ్స్, ఏడు ఆఫీస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 23 నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి గవర్నర్ కోసం భవనాన్ని ముస్తాబు చేస్తామని వెల్లడించారు. భద్రతా విషయాల రీత్యా కూడా భవనం బాగుందన్నారు.