
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని కర్నూలురోడ్డులో ఉన్న శ్రీరామ్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్న ప్రాంతంలో జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న గుడిపాటి కుమారి (45) మూడు నెలల క్రితం శ్రీరామ్ కాలనీలో అద్దె ఇంట్లో చేరింది. ఆమె మంగమూరురోడ్డులోని చికెన్ షాపులో పని చేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నవారు మంచం పూర్తిగా కాలిపోయి ఉంది. మంచం మీదనున్న దుప్పట్లు, దిండుతో పాటు టేబుల్ ఫ్యాన్ కూడా దగ్ధమయ్యాయి.
అయితే ఆమె శరీరంపై, చేతి మీద మాత్రమే కాలిన గాయాలున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మినీ గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడం గానీ, కాలిపోవడం గానీ జరగలేదు. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ప్రాణాలు పోయాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఆమె నివాసం ఉండే ఇంటి పక్కన రెండు, మూడు పోర్షన్లుకు సంబంధించిన గదులు కూడా ఉన్నాయి. కానీ ఘటనపై అక్కడున్న వారెవరూ నోరు మెదపడం లేదు. కుమారి పని చేసే చికెన్ షాపు నిర్వాహకుడు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికొచ్చాడు. మృతదేహాన్ని చూసి తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన బహిర్గతమైంది.
అప్పటి వరకు సహచర నివాసితులు ఎందుకు పట్టించుకోలేదోన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు.. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై ఎంపీ ప్రసాద్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కుమారి భర్త నానారావు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వివాహమైన తర్వాత వేటపాలెంలో ఉంటున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.