
అనివెట్టి మండపంలో వివాహ వేడుక జరుగుతున్న దృశ్యం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణలతో ఆదివారం రాత్రి శేషాచల కొండలు హోరెత్తాయి. వివాహాలకు అత్యంత బలమైన ముహూర్తాలు కావడంతో రాత్రి 7.21, 9.48 గంటల సమయాల్లో జోరుగా పెళ్లిళ్లు జరిగాయి. దీంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివెట్టి మండపం, అలాగే స్వామి కల్యాణ మండపాలు పూర్తిగా పెళ్లిజనాలతో నిండిపోయాయి.
ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలులేనంతగా పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రంలో దాదాపు 60కు పైగా వివాహాలు జరినట్లు పురోహితులు చెబుతున్నారు. పెళ్లిబృందాల వాహనాలతో క్షేత్ర రహదారులు కిక్కిరిశాయి. దేవస్థానం, ప్రైవేటు సత్రాలు, కల్యాణ మండపాలు, గదులు పెళ్లివారితో నిండిపోయాయి. వివాహానంతరం నూతన వ«ధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు చినవెంకన్నను, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరి ముహూర్తాలు కావడంతో పాటు, మరో రెండు నెలల వరకు వివాహాలకు బ్రేక్ పడటంతో జిల్లా వ్యాప్తంగా వందలాదిగా పెళ్లిళ్లు జరిగాయి.