పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్ను డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో బోల్తాపడింది.
తల్లి, కుమార్తె మృతి, 10 మందికి గాయాలు
కోస్గీ(కర్నూలు జిల్లా): పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్ను డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో బోల్తాపడింది. ఈఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా కోస్గీ మండలం దొడ్డ బెడగల్ గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా వలకలదిన్నెకు చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్లో వస్తుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో తల్లి కూతురు వెంకమ్మ(40), దుల్లమ్మ(10) అక్కడికక్కడే మృతి చెందారు.
అంతేకాకుండా ట్రాక్టర్లో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన స్థానికులు గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు.