నగరశివారులోని మణికొండ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కొండకళ్ల నరేందర్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
మణికొండ, న్యూస్లైన్: నగరశివారులోని మణికొండ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కొండకళ్ల నరేందర్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. విలీనానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన వ్యక్తినే 818 ఓట్ల రికార్డు మెజార్టీతో గె లిపించారు. పోలింగ్, లెక్కింపు ప్రక్రియలను పరిశీలిస్తే గ్రామంతోపాటు అత్యధిక కాలనీల ప్రజలు ఆయనవైపే మొగ్గు చూపారు.
మధ్యాహ్నం ఒంటిగంటవరకు 59.79 శాతం పోలింగ్ నమోదైంది. పంచాయతీ పరిధిలో 6,409 ఓట్లు ఉండగా వాటిలో 3,844 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఉపసర్పంచ్ కె.నరేందర్రెడ్డికి 1,811 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ యాలాల నరేశ్కు 993 ఓట్లు, టీడీపీ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బుద్దోలు జైహింద్రావుకు 982ఓట్లు వచ్చాయి. 14 వార్డుల్లో అత్యధికంగా బీజేపీ, నరేందర్రెడ్డికి ప్రచారం చేసిన వారే గెలుపొందటంతో అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎల్.నాగేశ్ను ఉపసర్పంచ్గా లెక్కింపు పూర్తయిన వెంటనే వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓటరు లిస్టులో పేర్లుండి.. తర్వాత తొలగింపు జాబితాలో మా ఓట్లు పోయాయని పలువురు ఎన్నికల అధికారులతో వాదనకు దిగారు. గెలుపొం దిన అనంతరం నరేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శివారు గ్రామా లను పంచాయతీలుగానే ఉంచాలని అందరూ కోరుతున్నారన్నారు.