కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆ సామాజిక వర్గీయుల్లో ఆందోళన రెట్టింపవుతుంది.
ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన
చోడవరంలో మౌనప్రదర్శన.. అడ్డుకున్న పోలీసులు
అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటు 18 మంది అరెస్టు
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆ సామాజిక వర్గీయుల్లో ఆందోళన రెట్టింపవుతుంది. మరో పక్క కాపులను అణిచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ఆ సామాజిక వర్గీయులు భగ్గుమంటున్నారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. రోడ్డెక్కిన కాపు నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తూ పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారు. కనీసం నిరసనలు, మౌనల ప్రదర్శ నలు చేసుకునేందుకు కూడా ఈ ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా అంటూ కాపు నేతలు నిలదీస్తున్నారు.
విశాఖపట్నం: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా పక్కన పెట్టేందుకే చంద్రబాబు సర్కార్ కాపు ఉద్యమాన్ని నీరుగారుస్తోందని జిల్లా కాపు నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమె త్తారు. గోడను కొట్టిన బంతిలా ఉద్యమాన్ని ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతలా ఉవ్వెత్తున ఎగసి పడుతుందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ అరెస్ట్కు నిరసనగా సుమారు 200 మందికి పైగా కాపునాడు కార్యకర్తలతో కలిసి అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నోటికి గుడ్డలు కట్టుకొని పట్టణ పురవీధుల్లో మౌన ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకుండా మౌనంగా ప్రదర్శన చేయడం కూడా తప్పేనా.. ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? అని నేతలు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రదర్శనకు అనుమతివ్వాలని కోరినప్పటికీ ససేమిరా అనడంతో పోలీసుల తో నేతలు వాగ్వాదానికి దిగారు. అమర్నాధ్, ధర్మశ్రీలతో 18 మందిని అరెస్ట్చేసి బలవంతంగా స్టేషన్కు తరలించారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట కాపునాడు నేతలు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. ప్లకార్డులు చేతబూని చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాపునాడు నేతలు వీసాల సుబ్బన్న, కోనేటి రామకృష్ణ, గొలుసు నరసింహమూర్తి తదితరులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా గొలుగొండ మండలంలో కాపునాడు కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. నక్కపల్లిలో కాపునాయకుడు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం కొత్తపాలెం జంక్షన్లో స్థానిక కాపునాడు నాయకుడు దొడ్డి కిరణ్కుమార్ తదితరులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.