
బాబు తీరింతే.. హామీ.. అదేమి!
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం రుణమాఫీ అమలులో అనుసరిస్తున్న విధానాలు, జాప్యం కారణంగా రైతులపై వడ్డీ భారం పెరుగుతోంది.
నిబంధనల ఛట్రంలో ‘రుణమాఫీ’
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం రుణమాఫీ అమలులో అనుసరిస్తున్న విధానాలు, జాప్యం కారణంగా రైతులపై వడ్డీ భారం పెరుగుతోంది. ఇదే సమయంలో రైతులు పంటల బీమా కోల్పోయే పరిస్థితి నెలకొంది. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం... రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు రోజుకో నిబంధన, షరతులు తెరపైకి తీసుకొస్తోంది. ఫలితంగా అర్హుల జా బితా గణనీయంగా తగ్గిపోతోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీకి అర్హత లభిస్తుందా... లేదా అనే ఆందోళనకు రైతుల్లో కనిపిస్తోంది. 2013 డిసెంబర్ చివరిలోపు రుణాలు తీసుకుని, చెల్లించకుండా ఉన్న వారికి మాత్రమే రుణ మాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం జిల్లాలో 5,24,340 మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2800 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. అయితే నిబంధనలు, షరతుల పేరిట భారీగా కోత విధిస్తుండటం గమనార్హం.
ఆధార్ సాకుతో 60వేల మందికి ఎగనామం
రుణ మాఫీ వివరాలు అప్లోడ్ చేసిన రైతుల్లో దాదాపు 60వేల మందికి ఆధార్ నెంబర్లు లేవు. వీరికి రుణ మాఫీ వర్తించదని ప్రభుత్వం చెబుతుండటంతో ఆ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆధార్ కార్డు పొందేందుకు వివరాలు నమోదు చేసుకున్నా యూఐడీ అందని పరిస్థితి. అయితే ప్రభుత్వం యూఐడీ నెంబర్లు ఇవ్వలేదని రుణమాఫీకి దూరం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యాన పంటలకు రుణ మాఫీ లేదని తేల్చారు. సాధారణ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు రైతులు వ్యవసాయ రుణాలు చెల్లించక్కర్లేదని.. అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకారం 2014 మార్చి చివరిలోపు తీసుకున్న రుణాలన్నిటికీ మాఫీ అమలు చేయాలి. కానీ డిసెంబర్ 31, 2013 వరకు తీసుకున్న రుణాల కు మాత్రమే మాఫీ అని ప్రకటించి వేలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.
డిఫాల్టర్లుగా మారిన రైతులు: రుణాలు కట్టొద్దని ప్రోత్సహించి, రుణ మాఫీ అమలులో అంతులేని జాప్యం చేస్తూ నిర్ణీత సమయంలోగా మాఫీ చేయకపోవడంతో రైతులు డీఫాల్టర్లుగా మారుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 7 శాతం వడ్డీ భారాన్ని భరించాల్సి వస్తోంది. ఈ ప్రకారం రైతులపై రూ.98 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అయితే, ఇందులోనూ 4 శాతం కేంద్రం, 3 శాతం రాష్ర్ట ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లిస్తాయి. అంటే రైతులకు వడ్డీలేని రుణాలు అందుబాటులో ఉంటాయన్నమాట.
అయితే, రుణ మాఫీ వస్తుందని రైతులు రుణాలు చెల్లించకపోవడంతో జులై 1 నుంచి రైతులు డిఫాల్టర్లుగా మారారు. అప్పటి నుంచి రైతులు 14 శాతం వడ్డీని భరించాల్సి వస్తోంది. దీని ప్రకారం అక్టోబర్ 31 వరకే రైతులపై రూ.93.30 కోట్ల భారం పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు జిల్లా రైతులపై రూ.261 కోట్ల వడ్డీ భారం పడనుండటం గమనార్హం. మొదటి దశలో కేవలం 20 శాతం మాత్రమే రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రుణ మాఫీలో అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాలకు దూరమయ్యారు. ఫలితంగా పంటల బీమాకు నోచుకోలేకపోయారు.
పొదుపు సొమ్ము హుష్కాకి: జిల్లాలో 35వేల డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.530 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. వీటికి కేవలం లక్ష ప్రకారం రివాల్వింగ్ ఫండ్ మాత్రమే ఇస్తామని ప్రకటించారు. రుణ మాఫీ వస్తుందనే ఉద్దేశంతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలపై వడ్డీ భారం భారీగా పడుతోంది.
మరోవైపు మహిళలు ప్రతీ నెలా దాచుకున్న పొదుపు మొత్తాలను రుణాల చెల్లింపు కింద బ్యాంకులు తీసేసుకుంటున్నాయి. కనీసం సంఘం నుంచి అనుమతి కూడా తీసుకోని పరిస్థితి. రుణమాఫీ కాకపోవడం, పొదుపు మొత్తం కూడా బ్యాంకులు లాగేసుకుంటుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో గ్రూపుల మధ్య తగాదాకు కారణమవుతోంది.