ఇదేమి న్యాయం..! | irregularities in electricity department | Sakshi
Sakshi News home page

ఇదేమి న్యాయం..!

Feb 13 2014 3:20 AM | Updated on Oct 17 2018 6:06 PM

విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల ఎంపికలో ఆరోపణలు వచ్చినట్లుగానే... మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోగా, అనర్హులకే ఉద్యోగాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ :  విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల ఎంపికలో ఆరోపణలు వచ్చినట్లుగానే... మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోగా, అనర్హులకే ఉద్యోగాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ ఎన్పీడీసీఎల్‌లో జరుగుతున్న అక్రమాల తంతు! మొదటి విడతలో ఆపరేటర్ల పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు స్తంభం ఎక్కే పరీక్షలను బుధవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌లో నిర్వహించారు.

నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లకు సంబంధించిన సబ్‌స్టేషన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టుల భ ర్తీకి అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం నాడు ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించిన అభ్యర్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్ డివిజన్‌కు చెందిన సీహెచ్ కొండూరు గ్రామంలోని బీసీ-డి కేటగిరికి చెందిన అభ్యర్థి తనకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కాల్ లెటర్ రాలేదనీ, తనకంటే తక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థికి కాల్‌లెటర్ వచ్చినట్లు వాపోయాడు. బాధితుడు ఈ విషయాన్ని ఆర్మూర్ డివిజన్‌లోని సంబంధిత అధికారులను విన్నవించిన ఫలితం దక్కలేదని ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 అయితే తన పేరును పత్రికలో ప్రచురించ వద్దని వేడుకున్నాడు. భవిష్యత్తులో అధికారులు కొర్రీలు పెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇదేవిధంగా తనకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ మండలం ఆమ్రాబాద్‌కు చెందిన ఎస్టీ అభ్యర్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్‌లెటర్ వచ్చిందన్నారు. ట్రాన్స్‌కో అధికారులు అభ్యర్థుల మార్కుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించక పోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement