ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు | Income incresing then additional trains | Sakshi
Sakshi News home page

ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు

Oct 27 2014 3:45 AM | Updated on Sep 2 2017 3:25 PM

రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు.

సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు
గిద్దలూరు : రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్‌లోని అన్ని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేసి టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. అక్టోబర్ నెలలో తక్కువ ఆదాయం రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో రూ.17.60 లక్షల ఆదాయంరాగా, ఈ నెలలో ప్రస్తుతానికి రూ.13.87 లక్షలు వచ్చినట్లు శ్రీరాములు గుర్తించారు.

ఇలా ప్రతి నెలా ఆదాయం తగ్గుతుంటే అదనపు బోగీలు, రైళ్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిం చారు. గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, గరీభ్థ్ ్రరైలును ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని విలేకరులు కోరగా కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేందుకు టికెట్లు అమ్ముడుపోతేనే ఆ రైలును ఇక్కడ ఆపుతామని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు గిద్దలూరులోనే పూర్తిస్థాయి టిక్కెట్ తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, బోగీలు సిద్ధం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలి పారు. యడవల్లి రైల్వేస్టేషన్‌లో టిక్కెట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కోరగా అక్కడ ఎంతమేర ఆదాయం వస్తుందో పరిశీలించి నివేదిక ప్రకారం టిక్కెట్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్ ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని, చాలా మంది నంద్యాల వెళ్లి రిజర్వేషన్ చేయించుకుంటున్నారని, రైల్వే విచారణ కోసం ఫోన్ చేస్తే సిబ్బంది ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్‌లో గంటకొట్టే వద్ద ఉన్న బూజు, దుమ్మును గమనించిన శ్రీరాములు.. స్టేషన్ మాస్టర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు పలువురు టిక్కెట్ కలెక్టర్లు, స్క్వాడ్ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement