అందరికీ ఆరోగ్యం | Identification card of any health and medical services | Sakshi
Sakshi News home page

అందరికీ ఆరోగ్యం

Jan 9 2014 3:22 AM | Updated on Oct 9 2018 7:52 PM

జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు, తెల్లరేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రవేశపెట్టిన సీఎంసీవో పెరిఫెరల్ సెంటర్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు మంజూరైంది.

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు, తెల్లరేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రవేశపెట్టిన సీఎంసీవో పెరిఫెరల్ సెంటర్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు మంజూరైంది. దీనిద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలు అందనున్నాయి. ఈ సెంటర్‌లు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మాత్రమే ఉన్నాయి. వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కర్నూల్‌తోపాటు మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉంది. రిమ్స్‌కు పెరిఫెరల్ సెంటర్ మంజూరు చేయాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఇటీవల ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రతిపాదనలు పంపినట్లు రిమ్స్ అధికారులు పేర్కొన్నారు. కలెక్టర్ చొరవతో గత డిసెంబర్‌లో రిమ్స్‌కు ఆరోగ్యశ్రీ మంజూరు చేసింది. మరో వారం రోజుల్లో ఈ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
 
 ఏదైన గుర్తింపు కార్డు ఉంటేసరి..
 చీఫ్ మినిస్టర్ క్యాంపు ఆఫీసు(సీఎంసీవో) పెరిఫెరల్ ఆరోగ్యశ్రీ కార్డు, తెల్లరేషన్ కార్డు అని కాకుండా ప్రభుత్వం నుంచి జారీ చేసిన ఏదైన గుర్తింపు కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కింద వచ్చే ఏ వ్యాధులకైన చికిత్సలు చేసుకోవచ్చు. ఆధార్, లెసైన్సు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, ఉపాధి హామీ పాస్‌బుక్ ఇలా ప్రభుత్వం అందించిన గుర్తింపు కార్డుతో రిమ్స్‌లో ఏర్పాటు చేసే పెరిఫెరల్ సెంటర్‌లో సంప్రదించాలి. సెంటర్‌లో ప్రత్యేకంగా ఓ వైద్యుడిని, ఒక ఆరోగ్య మిత్రను నియమిస్తారు. వీరు వచ్చిన రోగుల వివరాలు పెరిఫరెల్ సెంటర్‌లో ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని అవసరమైన చికిత్స కోసం రిఫర్ చేస్తారు. ఒకవేళ రిమ్స్ ఆస్పత్రిలో జరిగే చికిత్స అయితే ఇక్కడి నిర్వహిస్తారు. లేని పక్షంలో ఆరోగ్య శ్రీ కింద వచ్చే ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్యం అందజేస్తారు. ఈ సెంటర్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందుతాయి.
 
 మెరుగుపడ్డ ఆరోగ్యశ్రీ సేవలు..
 జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలోని ఆరోగ్య శ్రీ వార్డులో గతంలో కంటే ప్రస్తుతం వైద్య సేవలు మెరుగుపడ్డాయి. ఇటీవల రిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆరోగ్యశ్రీపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ప్రతినెల మొత్తంలో 70 నుంచి 80 కేసులు ఆరోగ్య శ్రీ వార్డులో నమోదు చేసుకునేవారు. ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాలతో పనులు వేగవంతం చేశారు. ఈ ఒక్క జనవరి 1 నుంచి ఇప్పటివరకు వారం రోజుల్లోనే 40 కేసులకు వైద్య చికిత్స అందించారు. ఈ 40 కేసులకు సంబంధించి రూ.10 లక్షలు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మం జూరయ్యాయి. ఇందులో భాగంగా కంప్యూటర్‌తోపాటు, పలు పరికరాలు ఆరోగ్య శ్రీ వార్డులో అందుబాటులో ఉంచారు. త్వరలో మరిన్ని నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో ప్రస్తుతం జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, ఆర్థ్రో, గైనిక్, జనరల్ మెడిసిన్, ఎన్‌ఐసీయూ చికిత్సలు అందిస్తున్నారు. మరిన్ని వైద్య చికిత్సలు చేసేందుకు నిపుణులైన వైద్యులు నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో రిమ్స్ ఆరోగ్య శ్రీలో సేవలు అందుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement