వివాహేతర సంబంధమే కారణమా..? | husband attack with knife | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే కారణమా..?

Nov 18 2018 7:38 AM | Updated on Nov 18 2018 7:38 AM

husband attack with knife - Sakshi

ఏలూరు టౌన్‌: భార్య, అత్తపై భర్త కత్తితో దాడి చేశాడు. ఏలూరు శాంతినగర్‌ 13వ రోడ్డులో శనివారం సాయంత్రం అత్త, భార్యలపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. భార్య అద్దేపల్లి భవ్యశ్రీకి తీవ్ర గాయాలు కాగా అత్తకు గాయాలయ్యాయి. వీరి ఇరువురిని ఏలూరు అశోక్‌నగర్‌లోని చైత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అద్దేపల్లి భాస్కరరావు, భవ్యశ్రీలకు కొంతకాలం క్రితం వివాహమైంది. సత్రంపాడులో పద్మావతి సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అత్త  ముమ్మిన హైమావతి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. 

భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త గొడవపడుతూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న గుడివాకలంకకు చెందిన ముంగర గణేష్‌ అలియాస్‌ అభిషేక్‌ అనే వ్యక్తితో భార్య భవ్యశ్రీ సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక తరుచూ గొడవలు పడుతున్నారు. భార్య భవ్యశ్రీకి అత్త హైమావతి వత్తాసు పలుకుతుందని, ఇద్దరిని అంతం చేయాలని శనివారం సాయంత్రం ఏలూరు శాంతినగర్‌ 13వ రోడ్డులో ఉన్న అత్త, భార్యలపై భాస్కరరావు కత్తితో దాడి చేశాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిందితుడు భాస్కరరావు ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, అక్కడ నుంచి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

భార్య కనపడటం లేదని ఫిర్యాదు
తన భార్య భవ్యశ్రీ, అత్త హైమావతి రెండు రోజులుగా కనిపించడం లేదని భాస్కరరావు శుక్రవారం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం ఇరు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడారు.  అయితే భవ్యశ్రీ విడాకులు కావాలని కోర్టులోనే తేల్చుకుంటామని పోలీసు అధికారుల వద్ద చెప్పి స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సాయంత్రం భర్త భాస్కరరావు భార్య, అత్తలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement