'వైఎస్సార్‌ కిశోర పథకం' ప్రారంభం

Home Minister Sucharita Launches YSR Kishora Scheme At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా రూపొందించిన 'వైఎస్సార్‌ కిశోర పథకం' లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గురువారమిక్కడ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనేదే సీఎం జగన్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇచ్చిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తరం మారుతోంది.. మనం కూడా మారి, తలరాతలు మార్చుకోవాలని హితవు పలికారు. స్మార్ట్ ఫోన్‌లు అనర్ధాలకు కారణం అవుతున్నాయనీ.. ఒత్తిడితో సహా అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.

మహిళల కోసమే మద్యపాన నిషేధం వైపు సీఎం అడుగులు
మంత్రి  తానేటి వనిత మాట్లాడుతూ... మద్యంపై వచ్చే ఆదాయం తగ్గినా మహిళల కోసం సీఎం జగన్ మద్యనిషేధం వైపు నడుస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తి జీవితంలో 'కీలకమైన బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, అదేవిధంగా యవ్వనంలో తల్లిదండ్రులను మోసం చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి' అని చెప్పారు. యవ్వనంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా కీలకమని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటం వలన చాలా నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిస్థితులను బట్టి గుడ్ టచ్., బ్యాడ్ టచ్‌లను గుర్తించాలని, ఎవరైన ఇబ్బంది పెడితే.. వెంటనే పెద్దలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top