గమనమే గండమైతే ఎలా? | highway road accident | Sakshi
Sakshi News home page

గమనమే గండమైతే ఎలా?

Jan 9 2015 12:15 AM | Updated on Sep 2 2017 7:24 PM

గమనమే గండమైతే ఎలా?

గమనమే గండమైతే ఎలా?

ప్రతి సంఘటనా ఓ అనుభవాన్ని మిగులుస్తుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే వివేకం కొరవడితే..

 ప్రతి సంఘటనా ఓ అనుభవాన్ని మిగులుస్తుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే వివేకం కొరవడితే.. జరిగే  విషాదానికి విధి కాక మానవ ప్పిదాలే ప్రధాన కారణాలు అవుతాయి. రహదారుల్నీ, వాహనాల్నీ సురక్షిత ప్రయాణానికి అనువుగా తీర్చి దిద్దకపోతే, వాహన చోదకుల్లో అప్రమత్తత కొరవడి, అలక్ష్యం హెచ్చితే.. ప్రయాణమే ఓ గండమవుతుంది. గమ్యం చేరడం ప్రశ్నార్థకమవుతుంది. రహదారులు రక్తంతో తడుస్తాయి. మృత్యువు విందారగించే వేదికలవుతాయి.  అనంతపురం జిల్లా పెనుగొండలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు జరిగిన ఘోర ప్రమాదం నేర్పే పాఠం, చేసే హెచ్చరిక ఇదే. మన జిల్లాలోనూ రోడ్లు, వంతెనల పరంగా అధ్వానస్థితి, అలక్ష్యం ఉన్నాయి. అవి తొలగినప్పుడే ప్రమాదాలకు అవకాశం, ప్రాణాలకు ముప్పు తప్పుతాయి.  
 
 అమలాపురం టౌన్ : జిల్లాలోని ప్రమాదకర మలుపులు, రోడ్లు మార్జిన్లు, రక్షణ గోడలు లేని శిథిల వంతెలనపై గత అయిదేళ్లలో చిన్న, పెద్ద ప్రమాదాలు దాదాపు 180 జరిగాయి. వీటిలో 54 మంది మృత్యువాత పడగా 70 మంది తీవ్రంగా, 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం నుంచి చాకలిపాలెం, గన్నవరం నుం చి గంటి వరకూ ప్రధాన పంట కాల్వ వెంబడి ఉన్న రోడ్లు అస్తవ్యస్తమైన మార్జిన్లతో ప్రమాదాలకు చిరునామాగా మారాయి.  ఆ రోడ్లలో గత అయిదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల కిందట గంటి పెదపూడి వద్ద అప్రోచ్ రోడ్డు సరిగా లేని వంతెన పైకి వెళుతున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు విద్యార్థులు విగతజీవులయ్యారు.
 
 ప్రాణాలు పోతున్నా పట్టని అలక్ష్యం
 జిల్లాలో అనేక చోట్ల శిథిల వంతెనలు, రోడ్డు మార్జిన్లు, మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ముఖ్యంగా ఆర్ అండ్ బి వారు సమస్య తీవ్రతను గుర్తించటంలో విఫలమవుతున్నారు. పి.గన్నవరం మండలంలో 22 కిలోమీటర్ల మేర కాల్వ వెంబడి ఉన్న రోడ్లో ఎన్ని ప్రమాదాలు జరిగినా అలాంటి అవకాశమున్న చోట రక్షణ గోడలు ఏర్పాటు చేసే చర్యలు శూన్యం. ఐ.పోలవరం మండలం కొమరిగిరి వద్ద 216 జాతీయ రహదారిలో ఓ మలుపులో గత మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. అక్కడ ప్రమాదకరమైన మలుపని  హెచ్చరిస్తూ కొట్టొచ్చినట్టు కనబడేలా బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు.
 
 అధ్యయనం అవసరం..
 జిల్లాలో ప్రమాదభరితంగా ఉన్న కాల్వలు, డ్రెయిన్లపై ఉన్న వంతెనలపై అధ్యయనం జరగాలి. వాటి స్థానే కొత్త వంతెనల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలి. లేదా తక్షణ మరమ్మతులు చేపట్టాలి. ప్రమాదకర మలుపులున్న చోట మలుపు లేకుండా చేయడానికి అవసరమైతే భూమిని సేకరించి రోడ్డును విస్తరించాలి. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వద్ద ‘ఎస్’ ఆకారంలోని మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి చోట స్థలం సేకరించి, రోడ్డు తిన్నగా ఉండేలా చేయాలి. మార్జిన్లు అధ్వానంగా ఉన్న చోట రోడ్డు వెడల్పు పెంచి, మార్జిన్లను రోడ్డు ఎత్తుకు పెంచాలి. ఇలా చేస్తే ప్రమాదాల నిరోధానికి ఆస్కారముంటుంది.
 
 మృత్యువు పొంచే తావులు మచ్చుకు కొన్ని..
  రంపచోడవరం నుంచి కాకవాడకు వెళ్లే రెండు అత్యంత ప్రమాదకర మలుపుల్లో వాహనం ఏ మాత్రం అజాగ్రతగా వెళ్లినా అంచునే ఉన్న లోయలో పడుతుంది.  216 జాతీయ రహదారిలో ముమ్మిడివరం మండలం నడవపల్లి వద్ద డ్రెయిన్‌పై ఉన్న కల్వర్టు ఎలాంటి రక్షణా లేక ప్రమాదాలకు కారణమవుతోంది. పిఠాపురంలో ఏలేరు కాల్వ వద్ద రోడ్డుకు ఎలాంటి రెయిలింగ్ లేదు. ఇక్కడ ప్రయాణం ప్రమాదం అంచునే అన్నట్టుంటుంది. ఆదమరుపుగా ఉన్నా పది అడుగుల లోతున ఉన్న కాల్వలో పడడం ఖాయం.  గొల్లప్రోలులో కాల్వపై వంతెన ప్రమాదకరస్థితిలో ఉన్నా ఎలాంటి హెచ్చరిక బోర్డూ లేక తరచూ ప్రమాదాలు జరగుతుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement